షికారుకు రెడీ
ABN , First Publish Date - 2021-04-13T07:01:51+05:30 IST
పాపికొండలు బోటు షికారు ఎట్టకేలకు ప్రారంభం కానుంది. పశ్చిమ గోదావరి జిల్లా సింగనపల్లిలో ఈనెల15న పర్యాటక శాఖకు చెందిన హరిత బోటు బయల్దేరుతుంది.
15న ప్రారంభం కానున్న పోలవరం పర్యటన
ప్రస్తుతానికి ఒక్క టూరిజం బోటుకే అనుమతి
తర్వాత ప్రైవేటు బోట్లు
లాంచీలకు అనుమతి లేదు
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
పాపికొండలు బోటు షికారు ఎట్టకేలకు ప్రారంభం కానుంది. పశ్చిమ గోదావరి జిల్లా సింగనపల్లిలో ఈనెల15న పర్యాటక శాఖకు చెందిన హరిత బోటు బయల్దేరుతుంది. టికెట్ ధర పెద్దలకు రూ.1,000, పిల్లలకు రూ.750 పెట్టే ఆలోచనలో ఉన్నారు. రెండ్రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది. కచ్చులూరు బోటు ప్రమాదం జరిగాక అనేక భద్రతా చర్యలు తీసుకున్న తర్వాతే షికారుకు అనుమతి ఇస్తామని పర్యాటక శాఖ అధికారులు చెప్పారు. గండిపోశమ్మ గుడి, సింగనపల్లి, పేరంటాలపల్లి, రాజమహేంద్రవరంల్లో కంట్రోలు రూమ్లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ టూరిజం, ఇరిగేషన్, పోలీసు, రెవెన్యూ సిబ్బంది ఉంటారు. టిక్కెట్లు ఇక్కడే అమ్ముతామని గతంలో చెప్పారు. కానీ రాజమహేంద్రవరంలో ఇప్పటికే టూరిజం ఏజెన్సీలు తెరుచుకున్నాయి. గతంలో బోటు టూరిజం మీద ఈ ఏజెన్సీలు ఆధారపడేవి. పాపికొండలు యాత్ర ఆగిపోయిన తర్వాత ఇవన్నీ మూతపడ్డాయి. ప్రైవేట్ బోట్ల నిర్వాహకులు, ఏజెన్సీల ప్రతినిధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరలా ప్రారంభం కానుండడంతో వీరిలో ఆనందం మొదలైంది. రాజమహేంద్రవరం అఖండ గోదావరిలో గత అక్టోబరులోనే బోటు షికారు మొదలైంది. ఉగాది సందర్భంగా ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన బోట్లు సరస్వతి ఘాట్ నుంచి మంగళవారం ప్రారంభం కానున్నాయి.
బాతీ మెట్రిక్ సర్వే పూర్తి కాకుండానే...
పాపికొండలు యాత్రకు ఇరిగేషన్ శాఖ బాతీ మెట్రిక్ సర్వే నిర్వహిస్తోంది. గోదావరిలో లోతు ఎక్కడ ఎంత ఉంది. ఎక్కడ ఇసుక దిబ్బలు, కొండలు ఉన్నాయి తదితర అంశాలు ఇందులో వున్నాయి. మరో 15 రోజులకు గానీ పూర్తి నివేదిక ఇచ్చే అవకాశం లేనట్టు సమాచారం. పర్యాటక శాఖ హడావిడిగా కొంత సమాచారం సేకరించి బోటు షికారుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వేసవి కాలంలో గోదావరిలో నీరు తక్కువగా ఉంటుంది. కానీ 2 మీటర్ల లోతు ఉంటే చాలని టూరిజం అధికారులు చెప్తున్నారు. పాపికొండలులో ఇప్పటి వరకు జరిగిన సర్వే ప్రకారం కొన్నిచోట్ల అతి ఎక్కువ లోతు 70 మీటర్ల ఉండగా, కొన్నిచోట్ల కేవలం 3 నుంచి 5 మీటర్ల లోతు మాత్రమే ఉండడం గమనార్హం.
పాపికొండలు యాత్రకు లాంచీలకు అనుమతి లేదు. కేవలం బోట్లకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. రాజమహేంద్రవరం 25 బోట్లు, ఆరు లాంచీలు ఉన్నాయి. పోతవరం వద్ద 20 లాంచీలు, ఆరు బోట్లు ఉన్నాయి. త్వరలో బోట్లకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్టు సమాచారం. దీంతో లాంచీల నిర్వాహకుల్లో ఆందోళన మొదలైంది.