యథేచ్ఛగా నాటు పడవల రాకపోకలు
ABN , First Publish Date - 2021-03-01T05:53:13+05:30 IST
వేసవి కాలం సమీపించడంతో గోదావరి నదిపై నాటు పడవల ప్రయాణాలు జోరందుకున్నాయి. కూనవరం మండలం పోలిపాక గోదావరి రేవు నుంచి ఎదురుగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలోని కుక్కునూరు ఎదురోడ్డు ఇంజరానికి ప్రయాణికులను రేవు దాటిస్తున్నారు.
- పోలిపాక రేవు నుంచి కుక్కునూరుకు ప్రయాణాలు
- పట్టించుకోని పోలీసు, రెవెన్యూ అధికారులు
కూనవరం, ఫిబ్రవరి 28: వేసవి కాలం సమీపించడంతో గోదావరి నదిపై నాటు పడవల ప్రయాణాలు జోరందుకున్నాయి. కూనవరం మండలం పోలిపాక గోదావరి రేవు నుంచి ఎదురుగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలోని కుక్కునూరు ఎదురోడ్డు ఇంజరానికి ప్రయాణికులను రేవు దాటిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ రేవు నుంచి నాటు పడవల రాకపోకలు యథేచ్ఛగా సాగుతున్నా రెవెన్యూ, పోలీసులు పట్టించుకోవడంలేదని విమర్శలు వస్తు న్నాయి. పోలిపాక రేవు నుంచి కొందరు ఇష్టారాజ్యంగా నాటు పడవలను నడుపుతున్నారు. ఎటువంటి రక్షణ చర్యలు లేకుండానే పరిమితికి మించి ప్రయాణికులను దాటిస్తున్నారు. చిన్నపిల్లల సహా అందరినీ ఎక్కిస్తూ గోదా వరిపై రాకపోకలు నిర్వహిస్తున్నారు. పోలిపాక రేవు నుంచి అవలి ఒడ్డు దాటించి నందుకు ఒక్కొక్కరి నుంచి రూ.70, ద్విచక్ర వాహనాలకు రూ.150 వసూలు చేస్తున్నారు. ఈ రెండు రేవుల నుంచి రోజుకు వందల మంది ప్రయాణికులతో రాకపోకలు సాగిస్తున్నారు. కుక్కునూరు, అశ్వారావుపేట మండలాలకు వెళ్లే వారికి ఈ ప్రయాణంతో గమ్యస్థానం దగ్గర కావడంతో చాలామంది గోదావరి నది దాటి వెళ్లడానికి ఆసక్తి చూపుతుంటారు. ఈ ప్రయాణాలు ఎంతవరకు భద్రమనే ప్రశ్నలు వినబడుతున్నాయి.