న్యూఢిల్లీకి చేరిన సౌమ్య సంతోష్ మృతదేహం

ABN , First Publish Date - 2021-05-15T17:22:24+05:30 IST

భర్తతో వీడియో కాల్ మాట్లాడుతుండగా ఇంటిపై రాకెట్ కూలడంతో ఇజ్రాయెల్‌లోని ఆష్కెలాన్‌లో నివసిస్తున్న కేరళకు చెందిన సౌమ్య సంతోష్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. రాకెట్ దాడిలో ప్రాణాలు విడి

న్యూఢిల్లీకి చేరిన సౌమ్య సంతోష్ మృతదేహం

న్యూఢిల్లీ: భర్తతో వీడియో కాల్ మాట్లాడుతుండగా ఇంటిపై రాకెట్ కూలడంతో ఇజ్రాయెల్‌లోని ఆష్కెలాన్‌లో నివసిస్తున్న కేరళకు చెందిన సౌమ్య సంతోష్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. రాకెట్ దాడిలో ప్రాణాలు విడిచిన సౌమ్య సంతోష్ మృతదేహాన్ని అక్కడి అధికారులు భారత్‌కు తరలించారు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఆమె మృతదేహం న్యూఢిల్లీకి చేరుకుంది. ఈ సందర్భంగా విదేశాంగ సహాయ మంత్రి వీ. మురళీధరన్, ఇజ్రాయెల్ దౌత్యాధికారి రోనీ యెడిడియా క్లెయిన్.. సౌమ్య సంతోష్ మృతదేహానికి నివాళులర్పించారు. సౌమ్య సంతోష్ మరణానికి గల కారణాన్ని వివరిస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కేంద్ర మంత్రి మురళీధరన్ భగవంతుడిని ట్విట్టర్ వేదికగా ప్రార్థించారు. 



ఇదిలా ఉంటే.. సౌమ్య సంతోష్ గత కొన్నేళ్లుగా ఆష్కెలాన్‌‌లో నివసిస్తూ ఓ వసతి గృహంలో కేర్ టేకర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా.. ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య ఎప్పటి నుంచో ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే ఈ ఘర్షణల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే గాజా నుంచి పాలస్తీనా మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు చేశారు. అందులోని ఓ రాకెట్ సౌమ్య ఇంటిపై పడటంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. సౌమ్య సంతోష్ అంత్యక్రియలు కేరళలోని ఆమె స్వస్థలంలో ఆదివారం రోజు జరగనున్నాయి.


Updated Date - 2021-05-15T17:22:24+05:30 IST