Bollywood కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్కు UAE బంపరాఫర్..!
ABN , First Publish Date - 2021-11-03T15:50:13+05:30 IST
బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ కుందర్కు అరుదైన గౌరవం దక్కింది. ఆమెకు యూఏఈ సర్కార్ గోల్డెన్ వీసా మంజూరు చేసింది.
దుబాయ్: బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ కుందర్కు అరుదైన గౌరవం దక్కింది. ఆమెకు యూఏఈ సర్కార్ గోల్డెన్ వీసా మంజూరు చేసింది. పదేళ్ల కాలపరిమితితో ఫరా ఖాన్కు యూఏఈ ఈ లాంగ్టర్మ్ రెసిడెన్సీ వీసాను జారీ చేసింది. దుబాయ్ ఎక్స్పో-2020లో ఆమె ఈ వీసా అందుకున్నారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రాం ఖాతా ద్వారా తెలియజేశారు. భారతీయ సినిమాకు తాను చేసిన సేవలకు గుర్తింపుగా దుబాయ్ సర్కార్ తనకు గోల్డెన్ వీసాతో సత్కరించిందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఈ అరుదైన గౌరవం పట్ల ఫరా ఖాన్ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆమె తన ఇన్స్టాగ్రాం ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. "గోల్డెన్ వీసా అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాకు దక్కిన అరుదైన గౌరవం. భారతీయ సినిమాకు చేసిన సేవలు, అచీవ్మెంట్స్కు తగిన గుర్తింపు లభించింది. ముఖ్యంగా 2014లో షారూక్ ఖాన్తో చేసిన హ్యాపీ న్యూ ఇయర్ మూవీకి దుబాయ్తో ప్రత్యేక అనుబంధం ఉంది. క్రియేటివ్ వ్యక్తులను ప్రోత్సాహిస్తున్న దుబాయ్ ఫిల్మ్ అండ్ టీవీ కమిషన్కు ప్రత్యేక ధన్యవాదాలు" అని ఫరా తన ఇన్స్టా పోస్టులో రాసుకొచ్చారు.
ఇదిలాఉంటే.. భారత్ నుంచి ఇప్పటివరకు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు యూఏఈ ఇచ్చే ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. వీరిలో బాలీవుడ్కు చెందిన షారూక్ ఖాన్, సంజయ్దత్, సునీల్ షెట్టి, బోనీ కపూర్ ఫ్యామిలీ, సంజయ్ కపూర్, ఊర్వశి రౌతేలా తదితరులు ఉన్నారు. అలాగే మలయాళం నుంచి మోహన్లాల్, మమ్ముటీ, పృథ్వీరాజ్ సుకుమారన్, టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ ఉన్నారు. వీరితో పాటు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ప్రముఖ గాయని కేఎస్ చిత్ర కూడా ఇటీవల గోల్డెన్ వీసా అందుకున్న విషయం తెలిసిందే.