బీజేపీ ఎంపీ ఇంటిపై మళ్లీ బాంబుల దాడి

ABN , First Publish Date - 2021-09-14T20:07:32+05:30 IST

పశ్చిమబెంగాల్‌లోని ఉత్తర పరగణాల జిల్లా బారక్‌పూర్‌లో ఉన్న బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ నివాసంపై ..

బీజేపీ ఎంపీ ఇంటిపై మళ్లీ బాంబుల దాడి

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని ఉత్తర పరగణాల జిల్లా బారక్‌పూర్‌లో ఉన్న బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ నివాసంపై మంగళవారంనాడు ఉదయం దుండగులు బాంబులు విసిరారు. సింగ్ నివాసంపై వారం రోజుల క్రితమే (సెప్టెంబర్ 8) కొందరు దుండగులు నాటు బాంబులు విసిరిన ఘటన మరువక ముందే మరోసారి ఈ దాడి ఘటన చోటుచేసుకుంది. ఘటన జరిగిన సమయంలో అర్జున్ సింగ్ ఢిల్లీలో ఉన్నారు.


కాగా, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిశీలకుడిగా బీజేపీ తనను నియమించిన నేపథ్యంలో టీఎంసీ మనుషులే తన నివాసంపై దాడి జరిపినట్టు అర్జున్ సింగ్ ఆరోపించారు. తన నివాసంపై బాంబులు విసరడం ఇది మొదటిసారి కాదని, తనను చంపాలని వారు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సోమవారం రాత్రే తనను భవానీ‌పూర్ నియోజకవర్గం పరిశీలకుడిగా నియమించాలని బీజేపీ నిర్ణయించడంతో మంగళవారం ఉదయమే బాంబు దాడులకు దిగారని చెప్పారు. బెంగాల్‌లో హింస ఆగలేదని చెప్పడానికి ఈ దాడులే నిదర్శనమని గవర్నర్ జగ్దీప్ ధన్‌కర్ వ్యాఖ్యానించారు. కాగా, ఈ ఆరోపణలను టీఎంసీ తోసిపుచ్చింది. బాంబు దాడి ఘటన ఎంపీ అర్జున్ సింగ్ సృష్టేనని వ్యాఖ్యానించింది.

Updated Date - 2021-09-14T20:07:32+05:30 IST