ముద్రగడ తప్పుకోవడంపై బోండా స్పందన
ABN , First Publish Date - 2020-07-13T18:57:21+05:30 IST
కాపు ఉద్యమం నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
విజయవాడ : కాపు ఉద్యమం నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావు స్పందించారు. ఉద్యమం నుంచి ముద్రగడ తప్పు కోవటం సరికాదన్నారు. సోమవారం నాడు విజయవాడలో మీడియా మీట్ నిర్వహించిన బోండా.. నాయకత్వం వహించే వారిపై విమర్శలు సహజమేనని చెప్పుకొచ్చారు. ముద్రగడపై సోషల్ మీడియా విమర్శలు చేసేది వైసీపీ వాళ్లేనని ఆయన చెప్పుకొచ్చారు.
సీఎం వైఎస్ జగన్కు ముద్రగడ కాపుల రిజరవేషన్లపై లేఖ రాసిన తర్వాతే సోషల్ మీడియా విమర్శలు మొదలయ్యాయని బోండా తెలిపారు. గత ప్రభుత్వం కాపులకు ఇచ్చిన 5శాతం రిజర్వేషన్లు జగన్ సర్కార్ రద్దు చేసిందన్నారు. ఇది నిజంగా కాపులకు జగన్ చేసిన ద్రోహమన్నారు. కాపు జాతి కోసం, రిజర్వేషన్ల కోసం ముద్రగడ ముందుకు రావాలని ఆయన చెప్పారు. త్వరలో 13 జిల్లాల కాపు నాయకులతో విజయవాడలో సమావేశం ఏర్పాటు చేస్తామని బోండా ఉమా మీడియా ముఖంగా తెలిపారు.