శంకుస్థాపన గోతిలో పడి బాలుడి మృతి
ABN , First Publish Date - 2021-08-17T17:30:15+05:30 IST
పట్టణంలోని..
పాయకరావుపేట: పట్టణంలోని ఓ ఇంటి ఖాళీ స్థలంలో వర్షపు నీటితో నిండిన గోతిలోపడి బాలుడు మృతిచెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలివి. పాయక రావుపేటకు చెందిన పల్లంకుర్తి శ్రీను సాయి ఆదర్శనగర్లోని ఓ అపార్టు మెంట్లో పనులు చేసుకుంటూ కుటుంబంతో అందులోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు మగపిల్లలు ఉండగా, వీరిలో రెండో కుమారుడు రాకేష్(7) ఆది వారం సాయంత్రం ఆడుకోవడానికి బయటకు వెళ్లాడు. రాత్రి కావస్తున్నా ఇంటికి రాకపోవడంతో తండ్రి శ్రీను చుట్టుపక్కల వారి ఇళ్లకు వెళ్లి వాకబు చేశాడు. ఫలితం లేకపోవడంతో రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ పి.ప్రసాదరావు వచ్చి పరిసరాలను పరిశీలించారు. ఆ పక్కనే ఖాళీ స్థలంలో శంకుస్థాపన కోసం గొయ్యి తీసి ఉండడాన్ని గుర్తించారు. అది వర్షపు నీటితో నిండి ఉండడంతో అనుమానం వచ్చి ఆ గోతిలో వెతికించగా, రాకేష్ విగతజీవిగా బయటపడ్డాడు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.