కిరాతకంగా బాలుడి హత్య
ABN , First Publish Date - 2022-01-26T05:06:27+05:30 IST
ఆడుకుంటానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు హత్యకు గురయ్యాడు. ఆ చిన్నారిని ఎవరో అతి కిరాతంగా హత్య చేసి బావిలోపడేశారు. ఈ ఘోరం మండలంలోని కత్తులవానిపల్లిలో మంగళవారం వెలుగుచూసింది.
వీపునకు రాయి కట్టి
బావిలో పడేసిన దుండగులు
కత్తులవానిపల్లిలో ఘటన
కొమరోలు, జనవరి 25 : ఆడుకుంటానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు హత్యకు గురయ్యాడు. ఆ చిన్నారిని ఎవరో అతి కిరాతంగా హత్య చేసి బావిలోపడేశారు. ఈ ఘోరం మండలంలోని కత్తులవానిపల్లిలో మంగళవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని దద్దవాడ గ్రామ పంచాయతీ అక్కపల్లి గ్రామానికి చెందిన భూమా ఓబులేసు కుమారుడు భూమా శ్రీనాథ్ (11) మండలంలోని తాటిచెర్ల పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. శనివారం రాత్రి ఆడుకోవడానికి అని తల్లితో చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఎంతసేపటికీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామం నలుమూలలా గాలించారు. అయినప్పటికీ బాబుజాడ కన్పించలేదు. వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గిద్దలూరు, కొమరోలు ఎస్ఐలు బ్రహ్మనాయుడు, సాంబశివయ్య అక్కపల్లి గ్రామానికివెళ్లి మూడు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే మంగళవారం ఉదయం కత్తులవానిపల్లి సమీపంలోని బావిలో మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి పరిశీలించగా అది శ్రీనాథ్ది అని తేలింది. బాలుడి నోటిలో గుడ్డలు కుక్కి, వీపునకు బలమైన రాయిని కట్టి బావిలో పడేసినట్లు తెలుస్తోంది. ఇంత కిరాతకంగా బాలుడిని ఎవరు, ఎందుకు చంపివుంటారో అన్న కోణంలో లోతుగా పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఓబులేసుకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఒక్కగానొక్క కొడుకు మృతితో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. శ్రీనాథ్ను చూసేందుకు బావి వద్దకు పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. పోస్టుమార్టం అనంతరం శ్రీనాథ్ మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. రాత్రికి శ్రీనాథ్ మృతదేహాన్ని మార్కాపురం డీఎస్పీ కిషోర్కుమార్ పరిశీలించారు. బాలుడు మృతిని హత్యకేసుగా నమోదు చేసి అన్ని కోణాల్లో పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.