భట్టి విక్రమార్క పాదయాత్రకు బ్రేక్
ABN , First Publish Date - 2022-01-09T00:30:40+05:30 IST
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తలపెట్టిన మహాపాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో వాయిదా వేశారు.
ఖమ్మం: సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తలపెట్టిన మహాపాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో వాయిదా వేశారు. ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గంలో ఆదివారం నుంచి పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. ముదిగొండ మండలం యడవల్లిలో పాదయాత్ర ప్రారంభించాలని భావించారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, తామరపురుగుతో నష్టపోయిన మిర్చిరైతులను ఆదుకోవాలని, పెరిగిన నిత్యావసర ధరలు తగ్గించాలని, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయాలనే డిమాండ్లతో భట్టి విక్రమార్క ఈ పాదయాత్రను తలపెట్టారు. ఇందుకు పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు చేశారు. అయితే కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో పోలీసులు మహాపాదయాత్రకు అనుమతి నిరాకరించారు. దీంతో భట్టి విక్రమార్క తన పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. కొవిడ్ ఆంక్షలు తొలిగిన తర్వాత తిరిగి పాదయాత్ర చేపడతారని కాంగ్రెస్ నేతలు తెలిపారు.