బెల్లం లావాదేవీలకు బ్రేక్
ABN , First Publish Date - 2022-01-20T06:28:27+05:30 IST
అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో ఎగుమతి వర్తకులు, కలాసీల మధ్య కూలి రేట్ల విషయంలో అభిప్రాయభేదాలు తలెత్తాయి.
ఎగుమతి వర్తకులు, కలాసీల మధ్య అభిప్రాయభేదాలు
పది కిలోల దిమ్మకు కూలి తగ్గించుకోవాలన్న వర్తకులు
ఏదైనా ఒకటే దిమ్మ అని తెగేసిన చెప్పిన కలాసీలు
గోనె సంచులకు బదులు పాలిథిన్ కవర్లతో ప్యాకింగ్
దిమ్మకు రూ.7.5 నుంచి రూ.2.5 కూలి తగ్గింపు
ఒకేసారి రూ.5 తగ్గిపోవడంతో కలాసీల అసహనం
నిలిచిపోయిన బెల్లం దిమ్మల వేలం పాట
అనకాపల్లి టౌన్, జనవరి 19: అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో ఎగుమతి వర్తకులు, కలాసీల మధ్య కూలి రేట్ల విషయంలో అభిప్రాయభేదాలు తలెత్తాయి. పది కిలోల దిమ్మకు కూలి రేటు తగ్గించుకోవాలని వర్తకులు సూచించగా, ఏదైనా ఒకటే దిమ్మని కలాసీలు తెగేసి చెప్పేశారు. అదే సమయంలో వర్తకులు గోనె సంచులకు బదులు పాలిథిన్ కవర్లతో ప్యాకింగ్ విధానం తీసుకువచ్చి ఒకేసారి కూలి రూ.5 తగ్గించేయడంతో కలాసీలు అసంతృప్తితో పనిలోకి వెళ్లలేదు. దీంతో బుధవారం బెల్లం లావాదేవీలకు బ్రేక్ పడింది.
ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో కార్మికుల (కలాసీలు)కు ఒక్కొ దిమ్మకు ఏడున్నర రూపాయల కూలిని వర్తకులు ఇచ్చేవారు. ఇటీవల పది కిలోల దిమ్మలు ఎక్కువగా వస్తున్నందున కూలి ధరను రూ.7.5 నుంచి రూ.5కు తగ్గించుకోవాలని వర్తకులు సూచించారు. అయితే దిమ్మ పది కిలోలైనా, 16 కిలోలైనా ప్యాకింగ్ ఒకటే కాబట్టి కూలి రేటు తగ్గించుకునేది లేదని కార్మికులు తెగేసి చెప్పారు.
ఇదిలా ఉండగా మార్కెట్కు వచ్చిన బెల్లం వేలం పాట పూర్తయిన తరువాత ఎగుమతి వర్తకుల తరపున కార్మికులు గోనె క్లాత్తో కట్టి ఎగుమతి చేయడం ఆనవాయితీ. అయితే కార్మికులు కూలి రేట్లు తగ్గించేది లేదని చెప్పడంతో వర్తకులు పాలిథిన్ కవరుతో బెల్లాన్ని ప్యాకింగ్ చేసే విధానాన్ని అమలులోకి తీసుకువచ్చారు. ఈ విధానం చాలా సులువైనది కావడంతో ఒక్కో దిమ్మకు కేవలం రూ.2.5 మాత్రమే ఇస్తామని వర్తకులు తెలిపారు. దీంతో ఒకేసారి దిమ్మకు రూ.5 తగ్గిపోవడంతో కార్మికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది సరైన విధానం కాదని, ఇలాగైతే తమకు కూలి ఏమాత్రం గిట్టుబాటు కాదని కార్మికులు స్పష్టం చేశారు. కాగా, కార్మికుల్లో సీనియర్లు ఎగుమతి వర్తకుల తరపున దిగుమతి వర్తకులు వేసిన బెల్లం వేలం పాటలో పాల్గొని కొనుగోలు చేస్తుంటారు. కూలి విషయంలో వర్తకులు దిగిరానప్పుడు తాము బెల్లం కొనుగోళ్లకు వెళ్లమని ఎగుమతి వర్తకులు చెప్పినట్టు కార్మిక సంఘం నాయకుడు పొలిమేర శివఅప్పారావు (మణి) తెలిపారు. దీంతో వర్తకులు కూడా బెల్లం వేలం పాటలకు ముందుకు రాకపోవడంతో బుధవారం లావాదేవీలు నిలిచిపోయాయి. ఫలితంగా జిల్లా నలుమూలల నుంచి బెల్లం రైతులు తీసుకొచ్చిన సుమారు ఎనిమిది నుంచి పది వేల దిమ్మలను ప్లాట్ఫారంపై టార్ఫాలిన్ కవర్లు కప్పి వదిలేశారు.
ఈ విషయమై వర్తక సంఘం అధ్యక్షుడు కొణతాల లక్ష్మీనారాయణను సంప్రతించగా, ఇరు వర్గాలతో రెండు రోజులుగా చర్చలు జరుపుతున్నామని, ఇంకా కొలిక్కి రాలేదని స్పష్టం చేశారు.