పెళ్లింట విషాదం.. వధువుతో పెళ్లికి వెళ్తుండగా..

ABN , First Publish Date - 2020-08-09T15:14:12+05:30 IST

నిశ్చితార్థం జరుపుకుని పెళ్లికుమార్తెను తీసుకుని..

పెళ్లింట విషాదం.. వధువుతో పెళ్లికి వెళ్తుండగా..

ఆటోను ఢీకొన్న కారు.. ఒకరి మృతి

ఇద్దరికి గాయాలు.. పెళ్లికుమార్తె, మరొకరు సురక్షితం


రావులపాలెం(తూర్పు గోదావరి): నిశ్చితార్థం జరుపుకుని పెళ్లికుమార్తెను తీసుకుని పెళ్లి జరిపించేందుకు తీసుకువెళ్లడానికి వచ్చిన పెద్దల్లో ఒకరు ప్రమాదంలో మృతిచెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది. ఆటోను కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా ఇద్దరు గాయాలపాలయ్యారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం కాకుల ఇలేంద్రపర్రుకు చెందిన సప్పవరపు కామేశ్వరరావు(52)తోపాటు మరికొందరు పెళ్లికుమార్తె స్వగ్రామమైన కొత్తపేట మండలం మోడేకుర్రు వచ్చి శనివారం నిశ్చితార్థం జరుపుకున్నారు. అనంతరం పెళ్లికుమార్తెతో ఆటోలో స్వగ్రామం బయలుదేరారు.


రావులపాలెం మండలం గోపాలపురం సెంటర్‌ సమీపంలో దాటే సమయానికి వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు బలంగా ఢీకొంది. దీంతో ఆటో బోల్తాకొట్టింది. ఈ సమయంలో ఆటోలో ఉన్న పెండ్లికొడుకు తరపు పెద్దలు సప్పవరపు కామేశ్వరరావు మృతిచెందగా తిప్పా మల్లన్న, శీలం కోటేశ్వరరావు గాయాలపాలయ్యారు. పెళ్లికుమార్తెతోపాటు మరొకరు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకుని గాయాలపాలైన వారిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం కొత్తపేట ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు అదనపు ఎస్‌ఐ శాస్త్రి తెలిపారు. 


Updated Date - 2020-08-09T15:14:12+05:30 IST