నా చెల్లిని ప్రేమిస్తావా..? యువకుడిని కొట్టి బావిలో పడేసిన యువతి సోదరులు
ABN , First Publish Date - 2020-05-21T17:23:04+05:30 IST
తమ చెల్లిని ప్రేమిస్తున్నాడన్న కోపంతో ఓ యువకుడిని యువతి సోదరులు కొట్టి బావిలో పడేశారు. ఈ సంఘటన బుధవారం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారం గ్రామంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం..
కొండపాక/మద్దూరు (ఆంధ్రజ్యోతి): తమ చెల్లిని ప్రేమిస్తున్నాడన్న కోపంతో ఓ యువకుడిని యువతి సోదరులు కొట్టి బావిలో పడేశారు. ఈ సంఘటన బుధవారం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారం గ్రామంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయిపల్లి గ్రామానికి చెందిన బింగి శ్రీకాంత్ హైదరాబాదులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి సోదరులు శ్రీకాంత్ను అంతమొందించాలనుకున్నారు. ఈ నెల 19న హన్మాన్ మాల విరమణకు శ్రీకాంత్ నర్సాయపల్లికి వచ్చాడు. ఇదే అదునుగా భావించిన యువతి సోదరులు బాల్రెడ్డి, మైపాల్రెడ్డి, ఉపేందర్రెడ్డి శ్రీకాంత్ను తీవ్రంగా కొట్టారు. చనిపోయాడని భావించి, యువతి అమ్మమ్మ గ్రామమైన కొండపాక మండలం బందారానికి తీసుకొచ్చి ఓ బావిలో పడేశారు. బుధవారం సాయంత్రం బావిలోంచి శ్రీకాంత్ కేకలు వేయడంతో అటువైపు వెళ్తున్న మేకల కాపరులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు శ్రీకాంత్ను బావిలో నుంచి బయటకు తీసి చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులపై హత్యాయ త్నం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పరమేశ్వర్ తెలిపారు.