అంబరాన్నంటిన రైతు సంబురాలు
ABN , First Publish Date - 2022-03-09T05:34:05+05:30 IST
రాజోలి భ్రమరాంబికా అడివేశ్వరస్వామి బ్రహ్మో త్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న రైతు సంబురాలు అంబరాన్నంటాయి.
- ఉత్సాహంగా సాగిన పెద్ద ఎద్దుల బల ప్రదర్శన పోటీ
రాజోలి, మార్చి 8 : రాజోలి భ్రమరాంబికా అడివేశ్వరస్వామి బ్రహ్మో త్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న రైతు సంబురాలు అంబరాన్నంటాయి. అందులో భాగంగా మంగళవారం అంతర్రాష్ట్ర పెద్ద ఎద్దుల బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. దేవస్థాన కమిటీ సభ్యులు నాగేశ్వర్రావు, గోపాల్రెడ్డి, చంద్రగౌడు, జయరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీటీసీ సభ్యుడు షాషావలి, మాజీ సర్పంచు శ్రీరామ్రెడ్డి, గంగిరెడ్డి బండకు పూజ చేసి పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలో ఆరు జతల ఎద్దులు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో 2,695 అడుగుల పొడవు బండను లాగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా, గుంపరమన్నెదిన్నె గ్రామానికి చెందిన కుందూరు రాంభూపాల్రెడ్డి ఎద్దులు ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్నాయి. 2,115 అడుగుల బండను లాగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, డోన్ మండలం, కొత్తకోటకు చెందిన డాక్టర్ రామోహన్ ఎద్దులు ద్వితీయ బహుమతిని సొంతం చేసుకున్నాయి. సోమశేఖర్, మల్దకల్ రాముడులకు చెందిన ఎద్దులు తృతీయ స్థానం, అయిజ మండలం, దేవబండ గ్రామానికి చెందిన భాస్కర్ గౌడు ఎద్దులు నాలుగవ స్థానం, కోడుమూడు మండలం, పాలకుర్తి మహ్మమియ్య ఎద్దులు అయిదవ స్థానం దక్కించుకున్నాయి. బహుమతిగా అందించే నగదును అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం, మాజీ సర్పంచు శ్రీరామ్రెడ్డి, నాయకులు సర్వేశ్వర్రెడ్డి, గౌరోజీ, రాజోలి ఎంపీటీసీ-2 గోనెగండ్ల షాషావలి, జయశంకర్రెడ్డి, కుర్వ పుట్ట రంగరాజు, మాజీ సర్పంచు కుర్వ కిష్టన్న చంద్రహాస్రెడ్డి ఇచ్చారు. విజేతలకు ఎంపీటీసీ సభ్యుడు షాషావలి, మాజీ సర్పంచులు గంగిరెడ్డి, కిష్టన్న చేతుల మీదుగా బహుమతులు అందించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కుర్వ వెంకటేశ్వర్లు, జైరెడ్డి, నిర్వాహకులు నాగేశ్వర్రావు, గోపాల్ రెడ్డి, చంద్రశేఖర్ గౌడు పాల్గొన్నారు.