కందుల రొక్క రాలే
ABN , First Publish Date - 2020-08-04T10:41:33+05:30 IST
మద్దతు ధర లభిస్తుందని, నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని చాలామంది రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో పంట
రైతుల ఖాతాల్లో జమ కాని డబ్బులు
సొమ్ముల కోసం కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు
సూర్యాపేట సిటీ :
మద్దతు ధర లభిస్తుందని, నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని చాలామంది రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో పంట విక్రయించారు. అయితే నెలలు గడుస్తున్నా రైతులకు డబ్బులు అందలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం 10 కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో మార్క్ఫెడ్ సౌజన్యంతో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో చివ్వెంల పీఏసీఎస్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించగా, ఇక్కడ విక్రయించిన రైతులకు నేటికీ డబ్బులు చెల్లించలేదు.
వానాకాలం సీజన్లో సాగుచేసిన కందుల కొనుగోలుకు ప్రభుత్వం ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా 10 కేంద్రాలు ఏర్పా టు చేసింది. నల్లగొండ జిల్లాలో మూడు, సూర్యాపేటలో రెండు, యాదాద్రి జిల్లాలో ఐదు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో నల్లగొండ జిల్లాలో రూ.23కోట్ల 94లక్షల 29వేల 800 విలువ చేసే 82,562 బస్తాల కందులను 5,534 మంది రైతులు విక్రయించారు. సూర్యాపేట జిల్లాలో రూ.26కోట్ల 60లక్షల 86వేల 600 విలువ చేసే 91,754 బస్తాల కందులను 6,182 మంది రైతులు విక్రయించారు. అదేవిధంగా, యాదాద్రి జిల్లాలో 6,052 మంది రైతులు రూ.31కోట్ల 16లక్షల 36వేల 900 విలువ చేసే 1,07,461 బస్తాల కందులను విక్రయించారు.
అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా 200 మంది రైతులకు డబ్బులు నేటికీ అందలేదు. ఒక్క సూర్యాపేట జిల్లాలో 50 మందికి కందుల డబ్బులు రావాల్సి ఉంది. పంట సొమ్ముల కోసం నల్లగొండ జిల్లా మిర్యాలగూడెంలో ఉన్న మార్క్ఫెడ్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. కందులు విక్రయించిన సమయంలో పంట ధ్రువీకరణ పత్రం, పట్టాదారు పాసుపుస్తకంతో పాటు బ్యాంకు ఖాతా పుస్తకం, ఆధార్కార్డు జీరాక్స్లను కొనుగోలు కేంద్రాల నిర్వాహలకు ఇచ్చామని, అయినా డబ్బు లు ఎందుకు జమ కావడంలేదో తెలియడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పొంతన లేని సమాధానాలు
కందుల డబ్బులు రాకపోవడాని కి కారణాలను మార్క్ఫెడ్ అధికారు లు చెప్పడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. జీరో అకౌంట్ పా సు పుస్తకం ఇచ్చారని, అందుకే డబ్బులు రాలేదని చెప్పారని, జీరో అకౌంట్ స్థానంలో మరో బ్యాంకు ఖాతా పుస్తకం జీరాక్స్ ఇచ్చి నెల రోజులు అయినా డబ్బులు జమ లేదని ఓ కంది రైతు వాపోయాడు. బ్యాం కు ఖాతా పుస్తకానికి ఆధార్ లింక్ కాలేదన్న కారణంతో డబ్బు లు జమ కాలేదని అధికారులు చెప్పారని, దీంతో ఖాతాకు ఆధార్ కార్డును లింక్ చేసినా డబ్బులు రాలేదని మరో రైతు తెలిపాడు. ఇదేంటని మార్క్ఫెడ్ అధికారులను నిలదీస్తే పొంతన లేని సమాధానం చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.