BWF World Tour Finals 2021: యమగుచికి షాకిచ్చి ఫైనల్ చేరిన సింధు
ABN , First Publish Date - 2021-12-05T01:06:42+05:30 IST
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరోమారు సత్తా చాటింది. ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్..
బాలి: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరోమారు సత్తా చాటింది. ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్లో ఫైనల్కు దూసుకెళ్లింది. జపాన్ క్రీడాకారిణి, ప్రస్తుత ప్రపంచ చాంపియన్, రెండుసార్లు ఒలింపిక్ విజేత అయిన అకానె యమగుచితో జరిగిన సెమీస్ పోరు చివరి వరకు హోరాహోరీగా సాగింది. 70 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్లో చివరికి సింధుదే పై చేయి అయింది. 21-15, 15-21, 21-19తో యమగుచిని మట్టికరిపించి ఫైనల్స్లోకి దూసుకెళ్లింది.
ఆదివారం జరగనున్న ఫైనల్లో దక్షిణ కొరియా క్రీడాకారిణి అన్ సెయంగ్తో సింధు తలపడుతుంది. వరల్డ్ టూర్ ఫైనల్స్ తుదిపోరుకు చేరడం సింధుకు ఇది మూడోసారి. 2018లో ఈ టైటిల్ అందుకున్న సింధు ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్గా రికార్డులకెక్కింది.
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్కు ముందు ఫ్రెంచ్ ఓపెన్, ఇండోనేసియా మాస్టర్స్, ఇండోనేసియా ఓపెన్లో సింధు సెమీస్ వరకు మాత్రమే చేరుకోగలిగింది. మార్చిలో జరిగిన స్విస్ ఓపెన్లో రన్నరప్గా నిలిచింది. సింధు, జపాన్ ప్రత్యర్థి యమగుచి నేటి మ్యాచ్తో కలిపి ఇప్పటి వరకు 21 సార్లు తలపడ్డారు. సింధు 13 సార్లు యమగుచిపై పైచేయి సాధించగా, యమగుచి 8సార్లు మాత్రమే సింధును ఓడించగలిగింది.