423 మందికి కరోనా
ABN , First Publish Date - 2020-09-26T09:12:04+05:30 IST
జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. శుక్రవారం కొత్తగా 423 మందికి కరోనా సోకింది.
మరో ఐదుగురు మృతి
కొవిడ్ ఆసుపత్రుల నుంచి 462 మంది డిశ్చార్జి
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. శుక్రవారం కొత్తగా 423 మందికి కరోనా సోకింది. కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న మరో ఐదుగురు బాధితులు మృతి చెందారు. గడచిన 24 గంటల్లో 462 మంది బాధితులు వ్యాధి నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి కావడం కాస్త ఊరటనిచ్చే పరిణామం.
కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 25,704కు చేరాయి. కరోనా మరణాలు అధికారికంగా 418కి పెరిగాయి. ప్రస్తుతం 2,786 మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. ఇంకా వేల మంది పాజిటివ్ బాధితులు హోం ఐసోలేషన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.
కొత్తగా ఆరు కంటైన్మెంట్ జోన్లు
విజయవాడ సిటీ : జిల్లాలో కొత్తగా మరో ఆరు కంటైన్మెంట్ జోన్లను కలెక్టర్ ఇంతియాజ్ శుక్రవారం ప్రకటించారు. అవనిగడ్డ మండలంలోని వాకనూరు, చల్లపల్లి మండలంలోని లక్ష్మీపురం, చందర్లపాడు మండలంలోని తోటరావులపాడు, గూడూరు మండలంలోని షబ్లుల్లపాలెం, జగ్గయ్యపేట మండలంలోని తొర్రగుంటపాలెం, విస్సన్నపేట మండలంలోని కొర్లమండ గ్రామాల్లో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడంతో ఈ ప్రాంతాల్లో కంటైన్మెంట్ నిబంధనలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలోని 504 కంటైన్మెంట్ జోన్లలో 2786 యాక్టివ్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.