ఫ్లడ్‌ అలర్ట్‌!

ABN , First Publish Date - 2020-09-28T10:55:01+05:30 IST

కృష్ణానదికి వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. ఆదివారం ఉదయం ఉదయం 11.30 గంటలకు ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికకు చేరుకుంది.

ఫ్లడ్‌ అలర్ట్‌!

 విజయవాడ సిటీ : కృష్ణానదికి వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. ఆదివారం ఉదయం ఉదయం 11.30 గంటలకు ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికకు చేరుకుంది. దీంతో కలెక్టర్‌ ఇంతియాజ్‌ వరద ఉధృతిని ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఆదివారం అన్ని శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ పరిస్థితిని సమీక్షించారు.


క్రమంగా వరద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకోనున్నందున అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. వరద నీరు ఆరు లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉన్నందున బ్యారేజ్‌ ఎగువ, దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వరద నీరు ఇన్‌ఫ్లో 4,55,330 క్యూసెక్కులు, అవుట్‌ప్లో 4,50,240 క్యూసెక్కులు ఉందన్నారు. జగ్గ్గయ్యపేట, ఇబ్రహీంపట్నం తహసీల్దార్లతో పాటు పెనమలూరు, తోట్లవల్లూరు, కంకిపాడు తహసీల్దార్లు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి, ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.


నదీ పరివాహక ప్రాంతాల తహసీల్దార్లు, ఇరిగేషన్‌, పోలీస్‌, అగ్నిమాపక, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, విద్యుత్‌, వ్యవసాయ, మత్స్యశాఖ, వీఎంసీ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి వరద సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తహసీల్దార్లు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత, విజయవాడ సబ్‌కలెక్టర్‌ ధ్యానచంద్ర, పులిచింతల ప్రాజెక్టు ఎస్‌ఈ, ఇతర అధికారులు సమీక్షలో పాల్గొన్నారు.

Updated Date - 2020-09-28T10:55:01+05:30 IST