నేటి నుంచి నియోజకవర్గ పర్యటనలు
ABN , First Publish Date - 2020-10-01T07:27:41+05:30 IST
టీడీపీకి పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తానని, ఇందులో భాగంగా నియోజకవర్గాల్లో పర్యటించే కార్యక్రమాలను గురువారం నుంచి ప్రారంభిస్తున్నట్లు మాజీ ఎంపీ, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు అన్నారు.
మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు
మచిలీపట్నం టౌన్, సెప్టెంబరు 30 : టీడీపీకి పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తానని, ఇందులో భాగంగా నియోజకవర్గాల్లో పర్యటించే కార్యక్రమాలను గురువారం నుంచి ప్రారంభిస్తున్నట్లు మాజీ ఎంపీ, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు అన్నారు. కొనకళ్ల కార్యాలయం వద్ద బుధవారం జరిగిన సమావేశంలో వివిధ ప్రాంతాల టీడీపీ నాయకులు ఆయన్ను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా కొనకళ్ల మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం విధానాలు మార్చుకోకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. కోర్టుల ప్రతిష్ఠ దిగజారేలా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారన్నారు. అనంతరం కొనకళ్లను ఏఎంసీ మాజీ చైర్మన్ మండపాక శంకరబాబు, వల్లూరుపల్లి గణేష్, పీవీ ఫణికుమార్ తదితరులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొనకళ్ల బుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
నమ్మించి నట్టేట ముంచారు
ప్రజలకు కల్లబొల్లి కబుర్లు చెప్పి, అధికారంలోకి వచ్చి, ప్రత్యేక హోదాపై మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు అన్నింట్లోనూ మోసం చేశారని మాజీ ఎంపీ, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు ధ్వజమెత్తారు. మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జులతో కలిసి కొనకళ్ల మీడియాతో మాట్లాడారు.
వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ గెలుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అవనిగడ్డ, గన్నవరం, మచిలీపట్నం, పెనమలూరు, పెడన నియోజకవర్గ ఇన్చార్జులు మండలి బుద్ధప్రసాద్, బచ్చుల అర్జునుడు, కొల్లు రవీంద్ర, బోడె ప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్ తదితరులు ప్రసంగించారు.