యూపీలో బీజేపీకి భారీ నష్టం : సీ-ఓటర్ సర్వే
ABN , First Publish Date - 2021-11-14T01:51:47+05:30 IST
రానున్న ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ కూటమికి
న్యూఢిల్లీ : రానున్న ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ కూటమికి భారీ నష్టం జరుగుతుందని, అయినప్పటికీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉందని ఏబీపీ-సీ ఓటర్ సర్వే నివేదిక వెల్లడించింది. గత ఎన్నికల్లో గెలిచిన స్థానాల్లో సుమారు 108 స్థానాలను ఈ కూటమి కోల్పోతుందని అంచనా వేసింది. ఈ కూటమికి 217 స్థానాలు, సమాజ్వాదీ పార్టీ కూటమికి 156, బీఎస్పీకి 18, కాంగ్రెస్కు 8 స్థానాలు లభించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
బీజేపీ కూటమికి 40.7 శాతం, సమాజ్వాదీ పార్టీ కూటమికి 31.1 శాతం, బీఎస్పీకి 15.1 శాతం, కాంగ్రెస్కు 8.9 శాతం ఓట్లు లభిస్తాయని అంచనా వేసింది. దీనినిబట్టి ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ, సమాజ్వాదీ మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశం కనిపిస్తోంది.
ఇదిలావుండగా, ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు ఈ సంస్థ నిర్వహించిన సర్వే నివేదికలనుబట్టి బీజేపీ కూటమి బలం క్రమంగా తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. మార్చి 18న విడుదల చేసిన నివేదికలో ఈ కూటమికి 284-294 స్థానాల వరకు లభించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. సెప్టెంబరు 3న విడుదల చేసిన నివేదికలో 259-267 స్థానాలు; అక్టోబరు 8 నివేదికలో 241-249 స్థానాలు ఈ కూటమికి లభించే అవకాశం ఉందని అంచనా వేసింది.