ఉద్యోగులకు క్యాడర్ వారీ ఆప్షన్లు
ABN , First Publish Date - 2021-12-06T08:04:31+05:30 IST
ఉద్యోగులకు క్యాడర్ వారీగా ఆప్షన్లు ఇచ్చి కేటాయింపు అవకాశం కల్పిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అన్నారు.
- ప్రక్రియ కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు
- ఉద్యోగ సంఘాలతో భేటీలో సీఎస్ సోమేశ్
హైదరాబాద్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులకు క్యాడర్ వారీగా ఆప్షన్లు ఇచ్చి కేటాయింపు అవకాశం కల్పిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అన్నారు. ఈ ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలకు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆదివారం టీజీవో, టీఎన్జీవో సంఘాల ప్రతినిధులతో సీఎస్ సమావేశమయ్యారు. ఉమ్మడి జిల్లాల పరిధిలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు స్థానిక క్యాడర్ల వారీగా పోస్టులు, ఉద్యోగుల కేటాయింపుపై వారితో చర్చించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లాలు, జోన్లు, మల్టీజోన్ల వారీగా పోస్టులు, ఉద్యోగుల కేటాయింపుపై కూడా చర్చించారు. కాగా, మొదటి దశలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో పోస్టులు, ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ చేపడతామని, మిగిలిన జిల్లాల్లో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత చేపడతామని సీఎస్ చెప్పినట్లు ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. అయితే త్వరితగతిన ఉద్యోగుల విభజన చేయాలని సీఎ్సను తాము కోరామని టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ తెలిపారు. ఇందుకు సంబంధించి సీఎస్ తమ సలహాలు, సూచనలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఉద్యోగుల విభజనకు అన్ని రకాల ఉద్యోగులూ సహకరించాలని టీజీవో అధ్యక్షురాలు మమత కోరారు. ఈ నెలలోనే ఆప్షన్లు ఉంటాయని, ఆఫ్లైన్లో ఉంటాయని తెలిపారు.