పరిహారం చెల్లించకపోతే భారత విదేశీ ఆస్తులు జప్తు చేస్తాం..

ABN , First Publish Date - 2021-01-27T07:45:51+05:30 IST

బ్రిటన్‌కు చెందిన ఇంధన సంస్థ కెయిర్న్‌ ఎనర్జీ.. భారత ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించింది. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కోర్టు తీర్పునకు లోబడి తమకు 140 కోట్ల డాలర్ల

పరిహారం చెల్లించకపోతే భారత విదేశీ ఆస్తులు జప్తు చేస్తాం..

మోదీ సర్కారుకు కెయిర్న్‌ హెచ్చరిక 

లండన్‌లోని భారత హై కమిషన్‌కు  లేఖ రాసిన బ్రిటన్‌ ఇంధన కంపెనీ 


న్యూఢిల్లీ: బ్రిటన్‌కు చెందిన ఇంధన సంస్థ కెయిర్న్‌ ఎనర్జీ.. భారత ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించింది. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కోర్టు తీర్పునకు లోబడి తమకు 140 కోట్ల డాలర్ల (సుమారు రూ.10,220 కోట్లు) పరిహారం చెల్లించకపోతే.. భారత్‌కు విదేశాల్లో ఉన్న బ్యాంక్‌ ఖాతాలు, విమానాలు, నౌకలు, తదితర ఆస్తులను జప్తు చేసుకునైనా వసూలు చేసుకుంటామంటోంది. పరిహారం చెల్లించడంలో విఫలైమన పక్షంలో జప్తు చేసుకునేందుకు అనువైన భారత విదేశీ ఆస్తులపై ఇప్పటికే ఆరా తీస్తున్నామని కూడా తెలిపింది. లండన్‌లోని భారత హై కమిషన్‌కు ఈ నెల 22న రాసిన లేఖలో కెయిర్న్‌ సీఈఓ సైమన్‌ థామ్సన్‌ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ లేఖ కాపీలను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ), ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, విదేశాంగ మంత్రి జైశంకర్‌కు సైతం పంపింది. ఆర్బిట్రేషన్‌ కోర్టు తీర్పే అంతిమం. విధిగా పాటించాల్సిందే. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ నిబంధనలకు లోబడిన దేశం కావడంతో తీర్పుకు లోబడాల్సి ఉంటుందని లేఖలో కెయిర్న్‌ పేర్కొంది.


కెయిర్న్‌ ఇప్పటికే నెదర్లాండ్స్‌, ఫ్రాన్స్‌లో భారత్‌కు వ్యతిరేకంగా క్లెయిమ్‌లను రిజిస్టర్‌ చేసింది. త్వరలో కెనడా, అమెరికాలోనూ చేయనుంది. కోర్టు నుంచి ఉత్తర్వులు పొందడం ద్వారా ఈ దేశాల్లో భారత ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం చేసుకుంటోంది. రూ.10,247 కోట్ల రెట్రోస్పెక్టివ్‌ పన్ను కేసులో ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ కోర్టు గత నెలలో కెయిర్న్‌కు అనుకూలంగా తీర్పు జారీ చేసింది. పన్ను బకాయిని రాబట్టుకునేందుకు గతంలో ప్రభుత్వం విక్రయించిన కంపెనీ షేర్లు, జప్తు చేసిన డివిడెండ్లు, నిలిపివేసిన ట్యాక్స్‌ రిఫండ్లను వడ్డీతో స హా (మొత్తం 140 కోట్ల డాలర్లు) చెల్లించాలని ఆదేశించింది. 


గతంలో కాంకో ఫిలిప్స్‌ సైతం: అమెరికాకు చెందిన  ఇంధన సంస్థ కాంకో ఫిలిప్స్‌ కూడా 2019లో ఇదే తరహా వ్యూహం అనుసరించింది. వెనిజులా ప్రభుత్వ ఇంధన సంస్థ పీడీవీఎ్‌సఏ నుంచి 200 కోట్ల డాలర్ల పరిహారాన్ని రాబట్టుకునేందుకు వెనిజులాకు ఇతర దేశాల్లో ఉన్న ఆస్తులను జప్తు చేసుకుంది. దాంతో వెనిజులా ప్రభుత్వం దిగివచ్చి కాంకో ఫిలిప్స్‌కు పరిహారం సొమ్ము చెల్లించాల్సి వచ్చింది. 

Updated Date - 2021-01-27T07:45:51+05:30 IST