యోగా.. జీవితంలో భాగం కావాలి
ABN , First Publish Date - 2021-06-22T09:08:34+05:30 IST
క్రమం తప్పకుండా యోగా సాధన ఆరోగ్యకరమైన జీవనానికి ఉపయోగ పడుతుందని, యోగాను జీవితంలో ఒక భాగం చేసుకోవాలని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు
గవర్నర్ విశ్వభూషణ్ పిలుపు
అమరావతి, జూన్ 21(ఆంధ్రజ్యోతి): క్రమం తప్పకుండా యోగా సాధన ఆరోగ్యకరమైన జీవనానికి ఉపయోగ పడుతుందని, యోగాను జీవితంలో ఒక భాగం చేసుకోవాలని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ప్రత్యేక పోస్టల్ కవర్ను గవర్నర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో యోగా ఐదు వేల సంవత్సరాల కిందటే ప్రారంభమైందని తెలిపారు. 2014లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించినట్టు చెప్పారు. దేశం కరోనా నుంచి కోలుకుంటోందని, క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం మంచి ఆరోగ్యానికి బాటలు వేసుకోవచ్చని చెప్పారు. చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ ఎం.వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.