భారత విమానాలపై కెనడా నిషేధం మరోసారి పొడిగింపు
ABN , First Publish Date - 2021-08-11T01:01:29+05:30 IST
భారత విమానాలపై ఆంక్షలనుకెనడా మరోసారి పొడిగించింది.
ఒట్టావా : భారత విమానాలపై ఆంక్షలనుకెనడా మరోసారి పొడిగించింది. ఈ క్రమంలో... సెప్టెంబరు 21 వరకు భారత్ విమానాలపై నిషేధాన్ని పొడగించినట్లు కెనడా ప్రభుత్వం వెల్లడించింది. కరోనా వైరస్ నేపధ్యంలో... విమానప్రయాణాలపై ఆంక్షలు అమలవుతున్న విషయం తెలిసిందే. డెల్టా వేరియంట్ విజృంభణ నేపధ్యంలో ఏప్రిల్ 22 న భారత్ నుంచి నేరుగా వచ్చే విమానాలపై కెనడా నిషేధం విధించింది. వాణిజ్య, ప్రైవేట్ ప్యాసింజర్ విమానాలపై నిషేధం విధిస్తుండగా, కార్గో, వైద్య సామాగ్రి రవాణా, మిలటరీ విమానాలకు మాత్రం మినహాయింపునిచ్చింది.
ఇక... ఎపిడెమియోలాజికల్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు కెనడా ప్రభుత్వం పేర్కొంది. పరిస్థితులు అనుకూలించిన వెంటనే విమాన సర్వీసులను పునప్రారంభించేందుకు భారత ప్రభుత్వం, విమానయాన సంస్థలతో కలిసి పని చేస్తుందని ఫెడరల్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా... కెనడాకు నేరుగా భారత్ నుంచి కాకుండా మరో దేశం నుంచి వచ్చే ప్రయాణికులకు మాత్రం అనుమతినిచ్చింది. పూర్తిగా వ్యాక్సినేట్ అయిన వారికి అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది.