‘ఎక్స్‌ అఫిషియో’ను రద్దు చేయండి

ABN , First Publish Date - 2020-11-28T08:49:09+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలకు ఎక్స్‌-అఫిషియో ఓటింగ్‌ను అవకాశాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాహిత

‘ఎక్స్‌ అఫిషియో’ను రద్దు చేయండి

 హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే వ్యాజ్యం

హైదరాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలకు ఎక్స్‌-అఫిషియో ఓటింగ్‌ను అవకాశాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. నిజామాబాద్‌జిల్లా, బాల్కొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఇ.అనిల్‌కుమార్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. జీహెచ్‌ఎంసీలో 150 డివిజన్లు ఉండగా.. 52 మంది ఎక్స్‌-అఫిషియో సభ్యులు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇలా చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆక్షేపించారు.


ప్రజాస్వామ్యంలో పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ప్రజా ప్రతినిధులను ప్రజలు ఎన్నుకుంటారని, వారు ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, కార్పొరేషన్లలో మేయర్‌, మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్‌ను ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. కానీ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మాత్రం గెలుపొందిన కార్పొరేటర్లతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నామినేటెడ్‌ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోడానికి అనుమతిస్తున్నారన్నారు.


ఎక్స్‌-అఫిషియో ఓటర్లకు అనుమతిస్తున్న జీహెచ్‌ఎంసీ చట్టం-1955లోని సెక్షన్‌ 90(1)ను న్యాయసమ్మతం కాదని ప్రకటిస్తూ.. కొట్టివేయాలని, ఈ వ్యాజ్యం విచారణలో ఉన్నంత కాలం సెక్షన్‌ 90(1)ను సస్పెండ్‌ చేయాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ, న్యాయశాఖల ముఖ్యకార్యదర్శులు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌లను ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు. 


Updated Date - 2020-11-28T08:49:09+05:30 IST