గంజాయి స్మగ్లింగ్‌ ముఠా అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-01-18T04:47:11+05:30 IST

గంజాయి స్మగ్లింగ్‌ ముఠాను పట్టుకున్న పోలీసులు

గంజాయి స్మగ్లింగ్‌ ముఠా అరెస్ట్‌
పట్టుబడిన గంజాయితో నిందితులు, డీసీపీ, పోలీసులు

  • 70 లక్షల విలువైన సరుకు పట్టివేత 
  • మూడు కార్లు, నగదు స్వాధీనం


కొత్తూర్‌: గంజాయి స్మగ్లింగ్‌ ముఠాను పట్టుకున్న పోలీసులు వారి నుంచి 70లక్షల విలువైన గంజాయిని, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూర్‌లో జాతీయ రహదారి పక్కన గంజాయిని వాహనం మార్పిడి చేస్తుండగా ఆదివారం రాత్రి పట్టుకున్నట్టు శంషాబాద్‌ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. కొత్తూర్‌లో సోమవారం ఆయన విలేకరులకు వివరాలు తెలిపారు. వరంగల్‌, నల్గొండ జిల్లాలకు చెందిన నాగరాజు, రవి ఏపీలోని విశాఖపట్నం జిల్లా సీలేరు ప్రాంతంలో గంజాయిని కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తు న్నారని తెలిపారు. ఇలా కొనుగోలు చేసిన 214 గంజాయి ప్యాకెట్లను మహారాష్ట్రకు చెందిన ముఠాకు అందజేస్తుండగా శంషాబాద్‌ ఎస్‌వోటీ సీఐ వెంకట్‌రెడ్డి, కొత్తూర్‌ ఇన్‌స్పెక్టర్‌ భూపాల్‌ శ్రీధర్‌ దాడి చేశారని తెలిపారు. ముఠా నుంచి రూ. 70లక్షల విలువైన గంజాయి, రూ.2లక్షల 10వేల నగదు, మూడు కార్లు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారని తెలి పారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు చెందిన బాబా చెందకర్‌, తిరుమలి బాలు, గణేష్‌ లహోరీ, రాజేంద్ర, సూర్యపేట జిల్లా గడిడేపల్లికి చెందిన మాలోతు వినోద్‌లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. పరారీలో ఉన్న మిగతా నిందితులను త్వరలో పట్టుకుంటామని డీసీపీ తెలిపారు.  



Updated Date - 2022-01-18T04:47:11+05:30 IST