ఆక్సిజన్ బెడ్లు దొరకట్లే..!
ABN , First Publish Date - 2021-05-08T04:11:19+05:30 IST
జిల్లాలో ఆక్సిజన్ బెడ్ల కొరత వేధిస్తోంది. చాలామంది కరోనా బాధితులకు పడకలు దొరకడం లేదు. బెడ్లు తక్కువ.. కేసులు సంఖ్య ఎక్కువ కావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే ఉన్న ఆక్సిజన్ పడకలు కరోనా బాధితులతో నిండిపో యాయి. దీంతో కొత్తగా ఆస్పత్రులకు వచ్చేవారికి అవి లభించకపోవడంతో అవస్థలు
కరోనా బాధితులతో నిండిపోయిన పడకలు
రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్ కేసులు
చికిత్స కోసం తప్పని అవస్థలు
(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ఆక్సిజన్ బెడ్ల కొరత వేధిస్తోంది. చాలామంది కరోనా బాధితులకు పడకలు దొరకడం లేదు. బెడ్లు తక్కువ.. కేసులు సంఖ్య ఎక్కువ కావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే ఉన్న ఆక్సిజన్ పడకలు కరోనా బాధితులతో నిండిపో యాయి. దీంతో కొత్తగా ఆస్పత్రులకు వచ్చేవారికి అవి లభించకపోవడంతో అవస్థలు పడుతున్నారు. జిల్లాలో దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సుమారు 1,755 ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయి. వీటిలో 1,611 పడకలపై కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. మిగిలిన 144 బెడ్లు ఏరోజుకారోజు అత్యవసర కేసులకు కేటాయిస్తున్నారు. దీంతో కొత్తగా కొవిడ్ లక్షణాలతో ఆస్పత్రులకు వచ్చేవారికి ఈ బెడ్లు దొరకడం లేదు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(రిమ్స్)లో పరిస్థితి మరీ దారుణంగా ఉందని బాధితులు వాపోతున్నారు. జాయింట్ కలెక్టర్ సుమిత్కుమార్ ఆసుపత్రిలోనే ఉంటూ పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. జిల్లా నలుమూలల నుంచి నిత్యం వందల సంఖ్యలో బాధితులు రిమ్స్కు వస్తుండడంతో అందరికీ ఆక్సిజన్ అందించడం ఆసుపత్రి వర్గాలకు కష్టంగా మారిందని సమాచారం. రిమ్స్, జెమ్స్ ఆసుపత్రుల ప్రాంగణాల్లో సెంట్రల్ ఆక్సిజన్ ఫిల్లింగ్ సెంటర్లు ఉండడంతో ప్రాణవాయువు సరఫరాకు ఇబ్బంది ఉండడం లేదు. కానీ, బెడ్లు సమకూర్చడం అధికారులకు ఇబ్బందిగా మారింది. అందుబాటులో ఉన్నవే అందరికీ అందజేసేందుకు తమవంతు కృషి చేస్తున్నామని వైద్యసిబ్బంది చెబుతున్నారు. కొందరు బాధితులకు రోజుల తరబడి ఆక్సిజన్ అందించాల్సి రావడంతో కొత్తగా ఆసుపత్రుల్లో చేరుతున్నవారికి ప్రాణవాయువు అందించలేక చేతులెత్తేస్తున్నారు. జిల్లాలో కొవిడ్ కేసుల సంఖ్య దాదాపు రెండు వేలకు తక్కువ కాకుండా నమోదవుతున్నాయి. ప్రతిరోజూ పది శాతం మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. దీంతో వార్డులన్నీ బాధితులతో నిండిపోతున్నాయి. మిగిలిన వారంతా హోం క్వారంటైన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రుల్లో సాధారణ బెడ్ల సంఖ్య పెంచినా ఆక్సిజన్ పడకలను మాత్రం పెంచలేకపోయారు.
ప్రైవేటు ఆసుపత్రుల్లో అంతే...
జిల్లా అధికారులు 11 ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్ బాధితులకు చికిత్స అందించేందుకు అనుమతి ఇచ్చారు. ఆరోగ్యశ్రీ కింద చేరుతున్న రోగులకు సకాలంలో ఆక్సిజన్ బెడ్లు అందడం లేదు. అందుబాటులో ఉన్న బెడ్లను ముందుగా చేరిన వా రికి కేటాయించడం, ప్రైవేటు వ్యక్తుల నుంచి డబ్బులు వసూలు చేసి ఆక్సిజన్ పడకలు అందిస్తుండడంతో ఇక్కడ కూడా కొరత ఏర్పడింది. సాధారణ బెడ్లపై చికిత్స పొందేందుకు బాధితులు ఇష్టపడకపోవడం కూడా ఒక కారణం. తమకు ఆక్సిజన్, లేదా ఐసీయూలో పెట్టాలని బాధితులు ఆందోళన చేస్తుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.