అమిత్షా నివాసానికి వెళ్లిన కెప్టెన్ అమరీందర్
ABN , First Publish Date - 2021-09-29T23:55:20+05:30 IST
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం..
న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్షా నివాసానికి బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వెళ్లారు. ఢిల్లీ పర్యటన వెనుక తన మనోగతాన్ని కెప్టెన్ వెల్లడించనప్పటికీ బీజేపీలో చేరేందుకే అమిత్షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలుసుకోనున్నట్టు మీడియాలో ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అమిత్షా నివాసానికి కెప్టెన్ వెళ్లడంతో రాజకీయాల్లో వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా, కెప్టెన్ వ్యక్తిగత పర్యటన నిమిత్తమై ఢిల్లీ వెళ్లారని, తన స్నేహితులు, సన్నిహితులను కలుస్తారని, మిగతావన్నీ ఊహాగానాలేనని కెప్టెన్ మీడియా అడ్వయిజర్ చెబుతున్నారు. మరోవైపు, కెప్టెన్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే రాహుల్ గాంధీ కేరళలో ఒకరోజు పర్యటనకు వెళ్లారు.