అర్ధరాత్రి పల్టీకొట్టిన Car.. మద్యం మత్తులో మరో జీవితం చిత్తు..
ABN , First Publish Date - 2021-12-21T14:35:52+05:30 IST
అతివేగం, మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు...
హైదరాబాద్ సిటీ/పేట్బషీరాబాద్ : అతివేగం, మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన ప్రమాదంలో మరో యువకుడు దుర్మరణం చెందాడు. పేట్బషీరాబాద్ ఎస్ఐ భాను తెలిపిన వివరాల ప్రకారం.. దుండిగల్ మునిసిపాల్టీ బహదూర్పల్లికి చెందిన ఎలిగారి బాలకృష్ణ(34), కిరణ్, అజయ్, వెంకట్, సతీష్, రాము స్నేహితులు. వీరంతా చిరువ్యాపారులు. ఆదివారం అర్ధరాత్రి బహదూర్పల్లిలో సతీశ్ కుమారుడు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.
ఆ సందర్భంగా స్నేహితులంతా మద్యం తాగారు. అనంతరం రైడింగ్కు వెళ్దామని రాత్రి 12 గంటల సమయంలో కిరణ్ తనకారులో బహదూర్పల్లి నుంచి దూలపల్లి వైపు వచ్చారు. దూలపల్లి ఫారెస్టు రోడ్డుపై అతివేగంగా వెళ్తూ మూలమలుపు వద్ద అదుపుతప్పి డివైడర్ను తాకడంతో కారు పల్టీ కొట్టి పక్కనున్న చెట్టుకు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బాలకృష్ణ కారులోనే మృతిచెందాడు. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. కారు నడిపిన కిరణ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి..
రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివరాత్రి యాదలక్ష్మి (30) బాలానగర్లోని మాదేవినగర్లో నివాసం ఉంటూ కూలీ పని చేస్తోంది. సోమవారం భర్త కనకయ్యతో కలిసి ద్విచక్ర వాహనంపై బాలానగర్ నుంచి చెంగిచర్లకు కూలి పనికి వెళ్తుండగా, మార్గమధ్యలో వరంగల్ హైవే పీర్జాదిగూడ పిల్లర్ నెం.86 వద్ద వెనక నుంచి వస్తున్న ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. వెనకాల కూర్చున్న యాదలక్ష్మి కింద పడగా, అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆమె తలపై నుంచి వెళ్లడంతో మృతి చెందింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృత దేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.