కొత్త ఏడాదిపై ‘కార్ల’ కంపెనీల ఆశలు
ABN , First Publish Date - 2021-01-04T06:00:01+05:30 IST
గత ఏడాది కొవిడ్-19తో కుదేలైన కార్ల కంపెనీలు కొత్త సంవత్సరంపై భారీగా ఆశలు పెట్టుకున్నాయి. కొన్ని సవాళ్లు ఉన్నా ఈ ఏడాది పరిస్థితి కొంతలో కొంతైనా కుదుటపడుతుందని ఆశిస్తున్నాయి.
నయా మోడళ్లు, ఫీచర్లతో వాహనాల విడుదలకు సన్నాహాలు
న్యూఢిల్లీ: గత ఏడాది కొవిడ్-19తో కుదేలైన కార్ల కంపెనీలు కొత్త సంవత్సరంపై భారీగా ఆశలు పెట్టుకున్నాయి. కొన్ని సవాళ్లు ఉన్నా ఈ ఏడాది పరిస్థితి కొంతలో కొంతైనా కుదుటపడుతుందని ఆశిస్తున్నాయి. కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్లోని తన ప్లాంట్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. టయో టా మరిన్ని కొత్త మోడల్స్ విడుదల చేయబోతోంది. హ్యుండయ్ మోటార్స్ మరిన్ని కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉంది.
ఈవీలపైనా దృష్టి: పెట్రోల్, డీజిల్ వాహనాలతో పాటు దేశీయ కార్ల కంపెనీలు ఇక విద్యుత్ వాహనాల (ఈవీ) పైనా దృష్టి పెట్టబోతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహకాలతో పాటు పెట్రోల్ బంకుల తరహాలోనే బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి రావడం ఇందుకు కలిసి కానుంది. టయోటా కిర్లోస్కర్ మోటార్.. మధ్య, దీర్ఘ కాలిక వ్యూహం కింద విద్యుత్, ఇతర ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలపై ప్రత్యేక దృష్టి పెడతామని ఇప్పటికే ప్రకటించింది. దీనికి తోడు మరిన్ని నగరాల్లో సబ్స్ర్కిప్షన్, లీజింగ్ మోడల్ను అందుబాటులోకి తేవాలని భావిస్తోంది.
ఉత్పత్తిని మించి డిమాండ్: కొవిడ్ సద్దుమణగడంతో టాటా మోటార్స్ వాహనాలకు డిమాండ్ ఉత్పత్తిని మించిపోయింది. ఇదే సమయంలో కొనుగోలుదారుల అభిరుచుల్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో టాటా మోటార్స్తో సహా పలు ఆటోమొబైల్ కంపెనీలు ఇప్పుడు భద్రత, సామర్ధ్యం, నాణ్యత, సౌకర్యాలకు పెద్దపీట వేస్తున్నాయి. కొవిడ్ కష్టాలతో పాటు.. మారుతున్న కొనుగోలుదారుల కొత్త అభిరుచులనూ తెరపైకి తెచ్చింది. దీంతో కార్ల కంపెనీలు అందుకు అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్లతో వాహనాలను మార్కెట్లో విడుదల చేసేందుకు సమాయత్తమవుతున్నాయి.
కియా కార్లకు మార్కెట్లో మంచి స్పందన లభిస్తోంది. డిమాండ్కు అనుగుణంగా వాహనాలు ఉత్పత్తి చేసేందుకు అనంతపురం ప్లాంట్లో మూడు షిఫ్టుల పని విధానం తీసుకురావాలని యోచిస్తున్నాం.
- కూక్యున్ షిమ్, ఎండీ,
సీఈఓ, కియా మోటార్స్
భారత మార్కెట్లో మరిన్ని పెట్టుబడులకు మేం కట్టుబడి ఉన్నాం. ఇందులో భాగంగా కొనుగోలుదార్లకు నచ్చే సరికొత్త ఫీచర్లతో మరిన్ని మంచి వాహనాలను మార్కెట్లో విడుదల చేస్తాం.
- ఎస్ఎస్ కిమ్, ఎండీ, సీఈఓ, హ్యుండయ్ మోటార్స్ ఇండియా