జాతీయ రహదారిపై స్కార్పియో బీభత్సం
ABN , First Publish Date - 2021-12-03T05:33:35+05:30 IST
జాతీయ రహదారిపై స్కార్పియో వాహనం బీభత్సం సృష్టించింది. టోల్ప్లాజా గేటుని ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయి బైపాస్రోడ్డులో మోటార్సైక్లిస్ట్ను ఢీకొట్టగా అతడు మరణించాడు.
టోల్ప్లాజా గేటును ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయిన వాహనం
వాహనం ఢీకొని ఒకరి మృతి
పిఠాపురం/గొల్లప్రోలు,
డిసెంబరు 2: జాతీయ రహదారిపై స్కార్పియో వాహనం బీభత్సం సృష్టించింది.
టోల్ప్లాజా గేటుని ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయి బైపాస్రోడ్డులో
మోటార్సైక్లిస్ట్ను ఢీకొట్టగా అతడు మరణించాడు. పోలీసులు వెంబడించినా
వాహనం దొరకలేదు. అందులో గంజాయి రవాణా అవుతున్నట్లు భావిస్తున్నారు.
కత్తిపూడి నుంచి పిఠాపురం వైపు వస్తున్న సీజీ 1100 నెంబరు గల స్కార్పియో
వాహనం బీభత్సం సృష్టించడంతో ప్రజలు భీతావహులయ్యారు. గొల్లప్రోలు
టోల్ప్లాజా వద్ద ఆగకుండా గేటుని ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయింది. హైవే,
గొల్లప్రోలు పోలీసులతో పాటు పిఠాపురం సీఐ వైఆర్కే శ్రీనివాసరావు
ఆధ్వర్యంలో సిబ్బంది దాన్ని వెంబడించారు. పిఠాపురం బైపాస్ రోడ్డులో హోండా
యాక్టివాపై వెళ్తున్న చందక అప్పారావు(60)ను ఢీకొట్టడంతో తీవ్రంగా
గాయాలయ్యాయి. పిఠాపురం నుంచి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స
పొందుతూ మరణించాడు. ఇక్కడ నుంచి వెళ్లిన వాహనం పెద్దాపురం మండలం దివిలిలో
పండ్ల వ్యాపారులకు చెందిన రెండు బండ్లను ఢీకొట్టి జగ్గంపేట వైపు
వెళ్లిపోయింది. దీంతో ఉన్నతాధికారులు జిల్లాలోని పోలీస్స్టేషన్లకు సమాచారం
అందించారు. స్కార్పియో వాహనంలో గంజాయి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వాహనం
ఎక్కడ ఉందో అని పోలీసులు ఆరా తీస్తున్నారు.