కనుపూరు కాలువలో కారు బోల్తా
ABN , First Publish Date - 2020-05-29T10:56:11+05:30 IST
కారు అదుపుతప్పి కనుపూరు కాలువలో బోల్తాపడడంతో ఒకరు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా ..
ఒకరి మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
వెంకటాచలం, మే 28 : కారు అదుపుతప్పి కనుపూరు కాలువలో బోల్తాపడడంతో ఒకరు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం మండలంలోని కసుమూరు పంచాయతీ పాలిచెర్లపాడు గ్రామ సమీపంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు పాలిచెర్లపాడు నుంచి కసుమూరు వైపు వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు మలుపు వద్ద కనుపూరు కాలువ వంతెన గోడను ఢీకొని సుమారు 25 అడుగుల మేర లోతు ఉన్న కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న షేక్ అసిఫ్ అలీ (30 ) అక్కడిక్కడే మృతి చెందగా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామానికి చెందిన సయ్యద్ మున్వర్ బాషా, షేక్ ఖాజవలీ తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఓ ప్రైవేటు అసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణం వేగమని తెలుస్తోంది. సమాచారం అందుకున్న నెల్లూరు రూరల్ సీఐ రామకృష్ణ, వెంకటాచలం ఎస్ఐ షేక్ కరీముల్లా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు అసిఫ్ అలీ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ అసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.