కారు సర్వీసు.. బాదుడే బాసూ!

ABN , First Publish Date - 2020-07-27T09:07:20+05:30 IST

హైదరాబాద్‌లోని పంజాగుట్టకు చెందిన శ్రీరామ్‌ బ్రాండెడ్‌ కారు వాడుతున్నాడు.

కారు సర్వీసు.. బాదుడే బాసూ!

  • కరోనా పేరిట, పికప్‌ అండ్‌ డ్రాప్‌కు అధికంగా వసూళ్లు
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న కార్ల యజమానులు
  • సిబ్బంది కొరత వల్ల తప్పట్లేదంటున్న సర్వీసింగ్‌ నిర్వాహకులు

హైదరాబాద్‌ సిటీ, జూలై 26 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని పంజాగుట్టకు చెందిన శ్రీరామ్‌ బ్రాండెడ్‌ కారు వాడుతున్నాడు. కరోనా విజృంభణతో రాకపోకలకు ఇబ్బందిగా ఉంటున్న కారణంగా.. సర్వీసింగ్‌ కేంద్రానికి ఫోన్‌ చేసి, తన కారును తీసుకెళ్లమని చెప్పాడు. దాంతో సిబ్బంది కారును తీసుకెళ్లి.. సర్వీసింగ్‌ చేసి తిరిగి తెచ్చి ఇచ్చారు. పికప్‌ అండ్‌ డ్రాప్‌ విధానంలో సర్వీసింగ్‌ చేసినందుకు అదనగా రూ. 1000 చెల్లించమన్నారు. ఎందుకని అడిగితే.. సంస్థ నిర్ణయించిన ధర సార్‌ అంటూ వారి సమాధానం. రూ. లక్షలు విలువ చేసే కారు సర్వీసింగ్‌లో వెయ్యికి బేరం ఎందుకులే అని వారు అడిగినంతా ఇచ్చేశాడు. ఇదీ ప్రస్తుతం నగరంలోని సర్వీసింగ్‌ సంస్థల తీరు. కరోనా వలన సర్వీసింగ్‌ కేంద్రానికి వచ్చేందుకు యజమానులు భయపడుతున్నారు. అధిక శాతం మంది పికప్‌ అండ్‌ డ్రాప్‌ పద్ధతినే ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితిని సర్వీసింగ్‌ కేంద్రాల నిర్వాహకులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా రూ.10 లక్షలకు పైబడిన కార్ల సర్వీసింగ్‌ విషయంలో అధీకృత సర్వీసింగ్‌ కేంద్రాలు అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.


కారును పూర్తిగా శానిటైజ్‌ చేయడంతో పాటు డ్రైవర్లు, మెకానిక్‌లను ఇంటి వరకు పంపించి సేవలందించాలంటే అదనంగా చెల్లించాల్సిందేనంటూ చెబుతున్నాయి. పికప్‌ అండ్‌ డ్రాప్‌ పద్ధతి ముందునుంచే ఉన్నా.. కరోనాకు పూర్వం అదనపు చార్జీల వసూళ్లు లేవు. సర్వీసింగ్‌ చార్జీ పోనూ రూ. 300లు ఇస్తే సరిపోయేది. ప్రస్తుతం రూ. 700, మరో రూ.200 బత్తా అడుగుతున్నారు. బ్రాండెడ్‌ కార్ల సర్వీసింగ్‌ను ఎక్కడపడితే అక్కడ చేయించడం సరికాదనే ఉద్దేశ్యంతో అధీకృత సర్వీసింగ్‌ కేంద్రాలనే అత్యధికులు ఆశ్రయిస్తున్నారు. తమ పరిస్థితిని గుర్తించి ఆయా కేంద్రాలు ఎక్కువగా చార్జీలు వసూలు చేస్తున్నాయని పలువురు కార్ల యజమానులు వాపోతున్నారు.


మా వద్ద సిబ్బంది తక్కువగా ఉన్నందుకే: నిర్వాహకులు

మరోవైపు.. తమ సర్వీసింగ్‌ వినియోగదారులు కరోనా భయంతో సగానికి సగం తగ్గిపోయారని సర్వీసింగ్‌ కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. ఓవైపు వ్యాపారం తగ్గడం, మరోవైపు తమ ఉద్యోగులు, మెకానిక్‌లు చాలామంది విధుల్లోకి రాకపోవడంతో పరిస్థితి ఇబ్బందిగా మారిందంటున్నారు. ఉన్నవారితోనే సరిపెట్టుకుంటూ, అవసరమైతే వారికి కొంచెం జీతాలు పెంచి వాడుకోవాల్సి వస్తుందని.. అందువల్ల ఎక్కువగా చార్జీలు వసూలు చేయక తప్పట్లేదని నిర్వాహకులు పేర్కొంటున్నారు. కాగా.. ఈ పరిస్థితులు అధీకృత సర్వీసింగ్‌ కేంద్రాల్లోనే కనిపిస్తున్నాయి. రూ. 10 లక్షల లోపు కార్లకు ప్రైవేటు సర్వీసింగ్‌ కేంద్రాలు తక్కువగా వసూలు చేస్తుండటంతో.. యజమానులు వాటివైపే మొగ్గు చూపుతున్నారు. బ్రాండెడ్‌ కార్లు, హైఎండ్‌ కార్ల యజమానులకు మాత్రం, అధీకృత కేంద్రాల్లో సర్వీసింగ్‌ చేయించక తప్పట్లేదు.

Updated Date - 2020-07-27T09:07:20+05:30 IST