కేర్‌ టేకర్స్‌

ABN , First Publish Date - 2021-06-16T05:39:39+05:30 IST

ఓ సంకల్పం. దాని కోసం ఉద్యమం. ఇరవై వేల మంది వాలంటీర్లు... 446 నగరాలు... ఈ విపత్కాలంలో కరోనా రోగులకు అండగా నిలబడుతోంది ఓ వెబ్‌సైట్‌. దాని వెనక ఉన్నది ఓ వ్యక్తి కాదు... యువశక్తి. లక్షల మందికి

కేర్‌ టేకర్స్‌

ఓ సంకల్పం. దాని కోసం ఉద్యమం. 

ఇరవై వేల మంది వాలంటీర్లు... 446 నగరాలు... ఈ విపత్కాలంలో కరోనా రోగులకు అండగా నిలబడుతోంది ఓ వెబ్‌సైట్‌. దాని వెనక ఉన్నది ఓ వ్యక్తి కాదు... యువశక్తి. లక్షల మందికి సేవలందించిన ఈ బృందం... ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్‌ కేర్‌ సెంటర్లను నెలకొల్పుతోంది. ఎలా? ఈ మెగా నెట్‌వర్క్‌ సృష్టికర్త, ముంబయికి చెందిన 29 ఏళ్ల రిషబ్‌ షా మాటల్లోనే... 


ఏప్రిల్‌ మాసం... కరోనా రెండో దశ ఉధృతమవుతున్న సమయం. ఆక్సిజన్‌ సిలిండర్లు, ఐసీయూ బెడ్ల కోసం సామాజిక మాధ్యమాల్లో కుప్పలు తెప్పలుగా అభ్యర్థనలు. ఎంతోమంది మానవతా మూర్తులు స్పందిస్తున్నారు. తోచిన సాయం చేస్తున్నారు. ఆసుపత్రికి వెళ్లేవారు సరే... మరి హోమ్‌ క్వారంటైన్‌లో ఉండేవారి పరిస్థితి ఏమిటి? ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఒకే ఇంట్లో ఉండడం అంత శ్రేయస్కరం కాదు కదా! అదీగాక ఒకటి రెండు గదులున్న ఇళ్లలో నెట్టుకొచ్చేవారు ఎందరో. అలాంటి స్వల్ప లక్షణాలున్నవారి కోసం ఒక వెబ్‌సైట్‌ ప్రారంభించాలనుకున్నాను. 


72 గంటల్లో వెబ్‌సైట్‌... 

నా ఆలోచనల్ని సామాజిక మాధ్యమాల ద్వారా స్నేహితులు, సన్నిహితులతో పంచుకున్నాను. ఊహించని స్పందన వచ్చింది. వంద మందికి పైగా విద్యార్థులు చేయి కలిపారు. వాళ్లందరి సహకారంతో కేవలం 72 గంటల్లో వెబ్‌సైట్‌ నిర్మించాం. పేరు... ‘ఫైండ్‌ ఏ బెడ్‌ డాట్‌ కామ్‌’. మే 1న ప్రారంభించాం. ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ప్రాంతం, పిన్‌కోడ్‌ ఎంటర్‌ చేస్తే, సమీపంలో ఉన్న హోమ్‌ క్వారంటైన్‌ సెంటర్లు, బెడ్స్‌ వివరాలు కనిపిస్తాయి. దేశంలోని 446 నగరాలకు సంబంధించిన 19,217 కేంద్రాల పక్కా సమాచారాన్ని దీనికి అనుసంధానించాం. అంతేకాదు... 11 భాషల్లో ఈ సమాచారం అందుబాటులో ఉంటుంది. 


మంచి పని కోసం... 

నిజానికి ఈ వెబ్‌సైట్‌ కోసం పనిచేస్తున్న విద్యార్థులంతా ‘ఇండియాస్‌ ఇంటర్నేషనల్‌ మూమెంట్‌ టు యునైట్‌ నేషన్స్‌’ (ఐఐఎంయూఎన్‌) వాలంటీర్లు. దీని వ్యవస్థాపక అధ్యక్షుడిని నేను. ప్రపంచంలోనే యువత నడిపిస్తున్న అతిపెద్ద సంస్థ ఇది. ఈ సంస్థకు చెందిన 20 వేలకు పైగా వాలంటీర్లు ప్రస్తుతం వెబ్‌సైట్‌ కోసం తమ సమయాన్ని కేటాయిస్తున్నారు. వీరిలో కొందరు కొవిడ్‌ కారణంగా తమ కుటుంబ సభ్యులను కోల్పోయినవారు కూడా ఉన్నారు. ‘ఈ ఆపత్కాలంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో విసిగిపోయాను. అందుకే ఈ ఉద్యమంలో భాగస్వామినయ్యాన’ని వాలంటీర్లు అంటుంటారు. ఎవరినో విమర్శిస్తూ సమయం వృథా చేసే కంటే మనకు సాధ్యమైనది చేయడం ఉత్తమం కదా! అదే వారికి చెబుతుంటాను. 


పరిశీలన... పరిశోధన... 

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ‘ఐఐఎంయూఎన్‌’ వాలంటీర్లతో జూమ్‌ మీటింగ్‌ ఒకటి పెట్టాం. ఈ పరిస్థితుల్లో మనం ప్రజలకు ఏ రకంగా సాయం చేయగలమనేది అందులో చర్చించాం. ఆ తరువాత అందుబాటులో ఉన్న సమాచారాన్నంతా పరిశీలించాం. వాటిపై మరింత లోతుగా పరిశోధించాం. అప్పుడు అర్థమైందేమిటంటే... కొవిడ్‌ సోకినవారిలో 98 శాతం రోగులకు ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదని! ఇంట్లోనో, ఏదో ఒక క్వారంటైన్‌ సెంటర్‌లోనో ఐసొలేషన్‌లో ఉంటే సరిపోతుందని! కానీ చాలామంది పాజిటివ్‌ రాగానే భయంతో ముందు ఆసుపత్రికి పరుగెడుతున్నారు. దీనివల్ల సీరియస్‌గా ఉన్నవారికి అత్యవసర సేవలు అందడంలేదు. వీళ్లందరికీ కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్స సరిపోతుందన్న ఆలోచనతోనే మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. 


రెండు లక్షల మందికి పైగా... 

మా వెబ్‌సైట్‌ ద్వారా ఇప్పటి వరకు 2.1 లక్షల మందికి పైగా కరోనా రోగులకు సాయం చేశాం. అంతేకాదు... మరో ఇల్లు ఉన్నవారు, ఖాళీ కార్యాలయాలు, స్కూళ్లను కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా మార్చమని అనేకమందిని అభ్యర్థించాం. దాదాపు వెయ్యి మంది స్పందించి ముందుకు వచ్చారు. ఇదంతా మా వాలంటీర్ల ఘనతే. వారిలో అధిక శాతం ఇరవై ఏళ్ల లోపువారే. ఎప్పుడైనా విశ్రాంతి తీసుకోమంటే... ‘అక్కర్లేదు... మేము మూడు, అవసరమైతే నాలుగో దశకు కూడా సన్నద్ధంగా ఉన్నాం’ అని చెబుతుంటారు. స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేసే వయసులో వారిలో ఇంతటి అంకతిభావం చూస్తుంటే గర్వంగా ఉంది. యువత తలుచుకొంటే ఏదైనా సాధ్యమనడానికి ఇంతకు మించిన ఉదాహరణ వేరే అక్కర్లేదేమో! 


కొవిడ్‌ కేంద్రాలు... 

ప్రస్తుతం దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేసే పనిలో ఉన్నాం. కనీస వైద్య సదుపాయాలు లేక లక్షల మంది గ్రామీణులు కరోనా వల్ల అవస్థలు పడుతున్నారు. తొలి ప్రయత్నంగా ‘అనన్య బిర్లా ఫౌండేషన్‌’ సహకారంతో రాజస్థాన్‌లోని ఝున్‌ఝునులో 25 పడకల సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చాం. దాని కోసం అక్కడి ఎస్పీ పెద్ద మనసుతో పోలీస్‌ గెస్ట్‌హౌస్‌ ఇచ్చారు. ఆయనలానే మరింత మంది ముందుకు రావాలి. ఇప్పటికైతే దేశ వ్యాప్తంగా 100 జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలను గుర్తించాం. త్వరలోనే అక్కడ కేర్‌ సెంటర్లను నెలకొల్పుతాం. దీనివల్ల ఆసుపత్రులపై భారం తగ్గుతుంది. 

Updated Date - 2021-06-16T05:39:39+05:30 IST