సమష్టి కృషితో కరోనా నివారణ
ABN , First Publish Date - 2021-05-19T07:42:27+05:30 IST
పల్లెల్లో కొవిడ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నందున అధికారులు సమిష్టి కృషితో పనిచేయాలని ఇన్చార్జ్ జిల్లా పంచాయతీ అధికారి, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ, జిల్లా కొవిడ్ కేర్ సెంటర్ నోడల్ అధికారి టి.శ్రీనివాస్ విశ్వనాధ్ కోరారు.
తాళ్లూరు, మే 18: పల్లెల్లో కొవిడ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నందున అధికారులు సమిష్టి కృషితో పనిచేయాలని ఇన్చార్జ్ జిల్లా పంచాయతీ అధికారి, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ, జిల్లా కొవిడ్ కేర్ సెంటర్ నోడల్ అధికారి టి.శ్రీనివాస్ విశ్వనాధ్ కోరారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం గ్రామ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులతో జరిగిన సమావేశానికి ఎంపీడీవో కేవీ కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 7వ విడత జ్వరపీడితుల సర్వేను మూడురోజుల్లో పూర్తి చేయాలన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల ఇంటి పరిసరాల్లో బ్లీచింగ్, సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి చేయాలన్నారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ పరీక్షలు నిర్వహించి సమాచారాన్ని ఆన్లైన్లో పొందు పరచాలన్నారు. కార్యక్రమంలో డీఎల్పీవో భాస్కరరెడ్డి, ఈవోఆర్డీ దారా హనుమంతరావు, గ్రామకార్యదర్శులు, గ్రామసచివాలయ ఉద్యోగులు, టాస్క్ఫోర్సు అధికారులు పాల్గొన్నారు.
కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలి
తాళ్లూరు, మే 18: కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని ఎస్సై బి.నరసింహారావు చెప్పారు. మండల టాస్క్ఫోర్సు బృందం మంగళవారం పలుగ్రామాలను సందర్శించింది. ఈ సందర్భంగా ఎస్సై నరసింహారావు మాట్లాడుతూ కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవనిహెచ్చరించారు. ఉదయం సడలింపు సమయంలో ప్రతి దుకాణం ముందు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని సూచించారు. ఇళ్లకు వెళ్లిన తరువాత చేతులను సబ్బుతో, శానిటైజేషన్తో శుభ్రం చేసుకోవాన్నారు. మద్యాహ్నం 12 తరువాత ప్రజలు రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తామన్నారు. తహసీల్దార్ పిబ్రహ్మయ్య మాట్లాడుతూ రెడ్జోన్ ప్రాంతాల్లో ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. లేకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. వైద్యబృందం ఇంటింటికి తిరిగి జ్వరపీడితుల సర్వే చేస్తున్నందున ప్రజలు సహకరించాలన్నారు. నాగంబొట్లపాలెంలో వైద్యాధికారి బి.రత్నం ఆధ్వర్యంలో కొవిడ్ ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్కు పరీక్షలు నిర్వహించారు. శివరాంపురం సచివాలయంలో కందుకూరు డీఎల్పీవో భాస్కర్రెడ్డి జ్వరాల సర్వేపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమాల్లో ఎంపీడీవో కేవీ కోటేశ్వరరావు, గ్రామ టాస్క్ఫోర్సు అధికారులు పాల్గొన్నారు.