కరోనా డేంజర్ బెల్స్
ABN , First Publish Date - 2022-01-18T05:48:00+05:30 IST
ఉమ్మడి జిల్లాలో కరోనా డేంజర్ బెల్స్ మోగాయి. గడిచిన ఆరు నెలల్లో ఎన్నడూ లేనంతగా సోమవారం అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే మూడు జిల్లాలో 308 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. మెదక్ జిల్లాలో 142 కేసులు నమోదవగా, సిద్దిపేట జిల్లాలో 93 కేసులు, సంగారెడ్డి జిల్లాలో 73 పాజిటివ్ కేసులు వచ్చాయి. పండుగ నేపథ్యంలో ప్రయాణాలు, పలుచోట్ల జాతరలు కొనసాగుతుండడంతో కరోనా విజృంభణకు మరింత ఆస్కారం ఏర్పడింది. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారికి, గతంలో పాజిటివ్ వచ్చిన వారికి మళ్లీ కొవిడ్ వైరస్ సోకుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలను పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 308 మందికి పాజిటివ్
వైరస్ బారిన డాక్టర్లు, మున్సిపల్, బ్యాంకు సిబ్బంది
అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన
ఉమ్మడి జిల్లాలో కరోనా డేంజర్ బెల్స్ మోగాయి. గడిచిన ఆరు నెలల్లో ఎన్నడూ లేనంతగా సోమవారం అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే మూడు జిల్లాలో 308 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. మెదక్ జిల్లాలో 142 కేసులు నమోదవగా, సిద్దిపేట జిల్లాలో 93 కేసులు, సంగారెడ్డి జిల్లాలో 73 పాజిటివ్ కేసులు వచ్చాయి. పండుగ నేపథ్యంలో ప్రయాణాలు, పలుచోట్ల జాతరలు కొనసాగుతుండడంతో కరోనా విజృంభణకు మరింత ఆస్కారం ఏర్పడింది. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారికి, గతంలో పాజిటివ్ వచ్చిన వారికి మళ్లీ కొవిడ్ వైరస్ సోకుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలను పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మెదక్ అర్బన్/ నర్సాపూర్/సంగారెడ్డి అర్బన్/నారాయణఖేడ్/సిద్దిపేట/సిద్దిపేట ప్రతినిధి, జనవరి 17 : ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా విజృంభణ మళ్లీ మొదలైంది. మొదటి, రెండో వేవ్ తర్వాత గతేడాది అక్టోబరు నుంచి కొంత శాంతించిన వైరస్ వ్యాప్తి మళ్లీ ముంచుకొచ్చింది. సోమవారం నమోదైన కేసులే ఇందుకు నిదర్శనం. ఒక్కరోజే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 308 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే పాజిటివ్ రేటు పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే పరిస్థితి మరింత తీవ్రస్థాయికి చేరుకునే ప్రమాదం లేకపోలేదని పలువురు వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొత్త వేరియంట్ ఒమైక్రాన్ ముప్పు పొంచి నేపథ్యంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కొవిడ్ బారిన పడడం ఖాయమని, తగిన జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
మెదక్ జిల్లాలో 142 మందికి పాజిటివ్
మెదక్ జిల్లా వ్యాప్తంగా సోమవారం 484 మందికి ర్యాపిడ్ టెస్టులు చేయగా.. నర్సాపూర్లో 28, మెదక్లో 13, రామాయంపేటలో 11, తూప్రాన్లో 8, పాపన్నపేటలో 5, కౌడిపల్లిలో 4, రేగోడ్లో 4, వెల్దుర్తిలో 3, నార్సింగిలో 3, కొల్చారంలో 3, అల్లాదుర్గంలో 2, చేగుంటలో 2, చిన్నశంకరంపేటలో 2, పెద్దశంకరంపేటలో 2, మాసాయిపేటలో 2 చొప్పున మొత్తం 92 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 170 మందికి ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించగా 50 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నర్సాపూర్లో ఒకేరోజు 28 మందికి పాజిటివ్గా తేలడంతో స్థానికంగా కలకలం రేపింది. అందులో 20 మంది పట్టణానికి చెందిన వారు కాగా 8 మంది ఇతర గ్రామాలకు చెందిన వారున్నారు. నర్సాపూర్ ప్రాంతీయ ఆసుపత్రిలో ముగ్గురు డాక్టర్లు, ఇద్దరు నర్సులతోపాటు, ముగ్గురు మున్సిపల్ సిబ్బందికి కూడా కరోనా సోకింది. మెదక్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కంటి వైద్య నిపుణులు, రంగంపేట ఎస్బీఐ బ్యాంక్ సిబ్బంది ఒకరు కరోనా బారిన పడ్డారు.
సిద్దిపేట జిల్లాలో 93 మందికి
సిద్దిపేట జిల్లాలో గడిచిన ఆరు నెలల్లో ఎన్నడూ లేనంతగా సోమవారం అత్యధిక కేసులు నమోదయ్యాయి. 2,130 మందికి టెస్టులు చేయగా 93 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. వారం రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 351 మంది కరోనా బారిన పడ్డారు. సోమవారం సిద్దిపేటలోని కోర్టులో 13 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. సిద్దిపేటలోని మూడు ఎస్బీఐ బ్రాంచీల్లో 8 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో బ్యాంకులకు సెలవు ప్రకటించినట్లు బోర్డు పెట్టారు. చేర్యాల ప్రభుత్వాస్పత్రి పరిధిలో 128 టెస్టులు చేయగా పది మందికి పాజిటివ్గా తేలింది.
మిరుదొడ్డి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 35 మందికి ర్యాపిడ్ టెస్టులను నిర్వహించగా ఐదుగురికి సోకింది. మండలంలోని అల్వాల్లో 2, చెప్యాలలో 2, మిరుదొడ్డిలో ఒక కేసు నమోదైంది. మద్దూరు మండల కేంద్రంలోని పీహెచ్సీలో 30 మందికి టెస్టులు నిర్వహించగా మర్మాములలో ఒకరికి, తోర్నాలలో మరొకరికి పాజిటివ్గా తేలింది. జిల్లాలో కొమురవెల్లి, కొండపోచమ్మ జాతరలు కొనసాగుతుండగా ఆది, సోమవారాల్లో ఇక్కడికి దాదాపు లక్షమందికిపైగానే భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. అయితే ఎక్కడా మాస్కులు, భౌతికదూరంపై కఠిన ఆంక్షలు పాటించలేదు.
సంగారెడ్డి జిల్లాలో 73 కేసులు
సంగారెడ్డి జిల్లాలో సోమవారం 73 మందికి కరోనా నిర్ధారణయింది. గరిష్ఠంగా నారాయణఖేడ్లో 28, పటాన్చెరులో 25, సంగారెడ్డిలో 15 మందికి కరోనా సోకింది. జిల్లావ్యాప్తంగా 409 మందికి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేశామని వైద్యాఽధికారులు తెలిపారు. నారాయణఖేడ్ ఏరియా వైద్యశాల పరిధిలో 155 టెస్టులు చేస్తే 28 మందికి పాజిటివ్ వచ్చింది. ఇందులో ఏడుగురు బ్యాంకు ఉద్యోగులుండడంతో ఉద్యోగులు, ఖాతాదారులు, ఆందోళన చెందుతున్నారు. పట్టణంలోని భారతీయ స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచిలో ఐదుగురికి, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ఇద్దరికి పాజిటివ్గా తేలింది. దీంతో రెండు బ్యాంకుల్లోను సేవలు నిలిపివేశారు. మున్సిపల్ సిబ్బంది బ్యాంకు శాఖల్లో శానిటైజేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు.
కరోనా నివారణార్థం నేడు మహా రుద్రాభిషేకం
జోగిపేట/వట్పల్లి : మహమ్మారిలా పట్టి పీడిస్తున్న కరోనా నివారణార్థం రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామి సూచన మేరకు మంగళవారం అందోలు మండలంలోని చందంపేటలో మహా రుద్రాభిషేకాలు నిర్వహిస్తున్నామని జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రామారావు దేశ్పాండే తెలిపారు.
కొవిడ్ నిబంధనలు పాటించాలి
మెదక్ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలను పాటించాలి. మాస్కు లేకుండా బయటకు రావొద్దు. కనీస భౌతికదూరం పాటించాలి. చేతులను శానిటైజ్ చేసుకోవాలి. వ్యాపార, వాణిజ్య సంస్ధలతోపాటు ప్రతీచోట శానిటైజ్, ఽథర్మల్ స్ర్కీనింగ్ చేయాలి.
-డా.వెంకటేశ్వర్రావు, మెదక్ జిల్లా డీఎంహెచ్వో