ఫలితం చెప్పని సర్వర్లు
ABN , First Publish Date - 2021-05-05T06:03:26+05:30 IST
కరోనా పరీక్షలు చేయించుకుని మూడు నాలుగు రోజులైనా ఫలితం రాక పోవడంతో ఎదురు చూపులు తప్పడం లేదు.
టెన్షన్తో అనుమానిత బాధితులు
పట్టించుకోని అధికారులు
ఏలూరు క్రైం, మే 4 : కరోనా పరీక్షలు చేయించుకుని మూడు నాలుగు రోజులైనా ఫలితం రాక పోవడంతో ఎదురు చూపులు తప్పడం లేదు. మొబైల్కు మెసేజ్ వస్తుందని చెబుతున్నప్పటికీ చాలా మందికి రావడం లేదు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి హెల్ప్ డెస్క్ వద్దకు వెళ్లి కరోనా పరీక్ష చేయించు కున్న ఐడీ నెంబర్తో రిజల్ట్ చెప్పమని అడిగితే వచ్చే సమాధానం ఒక్కటే. సర్వర్లు పనిచేయడం లేదని. ఎన్ని రోజులు వెళ్లినా ఇదే సమాధానం. వాస్తవానికి అక్కడ పనిచేసే సిబ్బంది సిస్టమ్లో ఎంత ప్రయత్నించినా సర్వర్లు పనిచేయడం లేదు. కరోనాకు సంబంధించి అన్ని రకాల (వ్యాక్సిన్ రిజిస్టర్, వ్యాక్సిన్ వేయడం) ఒకే పోర్టల్లో ఉండడంతో దానిపైన ఎక్కువ భారం పడడంతో అవి పనిచేయడం లేదు. ఆసుపత్రి అధికారులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా రాష్ట్రస్థాయిలో సర్వర్ల కెపాసిటీ పెంచాలన్న సమాధానం వస్తోంది. దీనిని ఎవరూ పట్టించుకోకపోవడంతో కరోనా పరీక్షకు ఇచ్చిన వారు టెన్షన్ టెన్షన్తో ఎదురు చూడాల్సి వస్తోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ఈ విషయంపై తక్షణం చర్యలు తీసుకుని సర్వర్ల కెపాసిటి పెంచేలా రాష్ట్ర స్థాయి అధికారులపై ఒత్తిడి తీసుకురావాలి.