బీజేపీ కార్పొరేటర్లపై కేసు
ABN , First Publish Date - 2021-11-25T00:09:27+05:30 IST
జీహెచ్ఎంసీలో జరిగిన ఘటనపై కేసు నమోదయింది. 32 మంది
హైదరాబాద్: జీహెచ్ఎంసీలో జరిగిన ఘటనపై కేసు నమోదయింది. 32 మంది బీజేపీ కార్పొరేటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై జీహెచ్ఎంసీ ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయింది. జీహెచ్ఎంసీ ఆఫీసులో బీజేపీ కార్పొరేటర్లు హంగామా చేశారు. సైఫాబాద్ పోలీసులు జీహెచ్ఎంసీలోని సీసీ ఫుటేజ్ సేకరించి, దాని ఆధారంగా కేసులు నమోదు చేశారు.
బీజేపీ మెరుపు ధర్నాతో బల్దియా కార్యాలయంలో బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. నిరసనలో భాగంగా బీజేపీ కార్యకర్తలు పూల కుండీలను పగలగొట్టారు. మేయర్ ఛాంబర్లో భైఠాయించి ఆందోళన చేపట్టిన బీజేపీ కార్యకర్తలు టేబుల్ విరగొట్టారు. వారంతా ఛాంబర్లోకి దూసుకెళ్లినా పోలీసులు అడ్డుకోలేకపోయారు. గ్రేటర్ కార్యాలయం అంతా పూల కుండీల మట్టితో నిండిపోయింది. మేయర్ ఛాంబర్లో ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. బల్దియా ఆఫీస్లో మేయర్కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు పోస్టర్లు అంటించారు. జీహెచ్ఎంసీ బోర్డుపై బ్లాక్ స్ప్రే కొట్టి నిరసన తెలిపారు. మేయర్, కమిషనర్ ఛాంబర్ల వద్ద కార్పొరేటర్లు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు తలుపులు తోసుకుంటూ దూసుకెళ్లారు. మెరుపు ధర్నాను అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు. జనరల్ బాడీ మీటింగ్, గ్రేటర్కు నిధులు కేటాయించాలనే డిమాండ్తో బీజేపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు.