నకిలీ మద్యం పట్టివేత
ABN , First Publish Date - 2022-02-15T05:15:45+05:30 IST
నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాను పట్టుకొని, రూ.15 లక్షల విలువైన నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ దత్తురాజ్గౌడు అన్నారు.
- రూ.15 లక్షల విలువైన మద్యం స్వాధీనం
- ఎనిమిది మందిపై కేసు, ఆరుగురికి రిమాండ్
గద్వాల క్రైం, ఫిబ్రవరి 14 : నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాను పట్టుకొని, రూ.15 లక్షల విలువైన నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ దత్తురాజ్గౌడు అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. ఆదివారం మధ్నాహ్నం పాతపాలెం స్టేజీ వద్ద రూట్ వాచ్ చేస్తుండగా రాయిచూర్ వైపు నుంచి ఎర్టిగా కారు వస్తుండడం గమనించామన్నారు. వాహనాన్ని ఆపి తనిఖీ చేయ గా రెండు క్యాన్లలో నకిలీ మద్యం (ఒక్కొక్కటి 35 లీటర్లు) లభ్యమైందని చెప్పారు. కారులో ఉన్న బొంకూరు గ్రామానికి చెందిన లోకేష్గౌడు, కలుకుంట్ల గ్రామానికి చెందిన నాగరాజు గౌడు, పాతపాలెం గ్రామానికి చెందిన మాటకారి వీరేష్ను అదుపులోకి తీసుకొని విచారణ నిర్వహించినట్లు తెలిపారు. పాతపాలెంలోని దలయి గోపి ఇంటికి మద్యాన్ని తీసుకెళ్తున్నట్లు వారు చెప్పడంతో, అక్క డికి వెళ్లి సోదాలు చేశామని అన్నారు. అక్కడ మరో క్యాన్లో బ్లెండెడ్ నకిలీ మద్యం, ప్రముఖ మద్యం కంపెనీకి చెందిన 50 సీసాల నకిలీ మద్యం లభ్యమయ్యాయని, గోపిని అదుపులోకి తీసుకున్నా మని చెప్పారు. నిందితులను విచారించగా, కర్ణాటక లోని గంగావతికి చెందిన శ్రీనివాస్గౌడ్ నుంచి మద్యం తీసుకొచ్చి, కర్నూల్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. వారం క్రితం మద్దెలబండ గ్రామానికి చెందిన వీరన్న గౌడుకు ఒక క్యాన్, సింగవరం గ్రామం, అలంపూర్ మండలానికి చెందిన తాండ్రపాడు బాబుగౌడుకు నాలుగు క్యాన్లు ఇచ్చినట్లు చెప్పారు. దీంతో మద్దెలబండ గ్రామానికి వెళ్లి, నకిలీ మద్యం క్యాన్ను, ద్విచక్ర వాహనాన్ని స్వాధీ నం చేసుకొని వీరన్నను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేశామని, వారిలో ఆరుగురిని కోర్టులో హాజరు పరి చి రిమాండ్కు తరలించినట్లు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ దత్తురాజ్గౌడు వివరించారు. అలాగే అలంపూర్ స్టేషన్ పరిధిలో నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఎక్సైజ్ ఉప కమిషనర్ ఖురేషి, అసిస్టెంట్ కమిషనర్ దత్తు రాజ్గౌడు, ఎక్సైజ్ జిల్లా అధికారి సైదులు పర్యవేక్షణలో నకిలీ మద్యం కేసును ఛేదించినట్లు తెలిపారు. రూ. 15 లక్షల విలువైన నకిలీ మద్యాన్ని పట్టుకున్నట్లు చెప్పారు. నిందితుల నుంచి రెండు ద్విచక్రవాహనాలు, ఒక కారును స్వాఽధీనం చేసుకున్నట్లు చెప్పారు. దాడులలో గద్వాల ఇన్స్పెక్టర్ గోపాల్, టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ పటేల్ బానోత్, అలంపూర్ ఇన్స్పెక్టర్, హన్మనాయక్, ఎస్ఐలు రాజేందర్, గోవర్ధన్, హరి, అనంతరెడ్డి, కృష్ణ, సిబ్బంది చందర్, రాజు, వేణు, నాయుడు, మహేష్, రవి, పుష్పరాజ్, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.