ప్రవీణ్కుమార్పై కేసు
ABN , First Publish Date - 2021-07-22T06:58:00+05:30 IST
ఆర్ఎస్ ప్రవీణ్కుమార్పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేయాలని కరీంనగర్ ప్రిన్సిపల్ జుడీషియల్
- నమోదు చేయాలని కరీంనగర్ పోలీసులకు కోర్టు ఆదేశం
- హిందూదేవుళ్లకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారని ఫిర్యాదు
కరీంనగర్ క్రైం, జూలై 21 : ఆర్ఎస్ ప్రవీణ్కుమార్పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేయాలని కరీంనగర్ ప్రిన్సిపల్ జుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ సాయిసుధ బుధవారం స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడుకాపూర్(ధూళికట్ట) గ్రామంలో మార్చి 15న హిందూదేవుళ్లకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేసిన స్వేరోస్ భీమ్దీక్ష కార్యక్రమంలో ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు న్యాతరి శంకర్బాబు ఆ ప్రతిజ్ఞ చేయించారు.
హిందూదేవతలను అవమానించే రీతిలో ప్రతిజ్ఞ చేశారని న్యాయవాది బేతి మహేందర్రెడ్డి కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసును విచారించిన అనంతరం ప్రవీణ్కుమార్, న్యాతరి శంకర్బాబులపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై ఓ వార్తా సంస్థ ప్రశ్నించగా, తనకు చట్టం, మన రాజ్యాంగంపై విపరీతమైన విశ్వాసం ఉందని ప్రవీణ్కుమార్ చెప్పారు. తెలంగాణ పోలీసుల వృత్తిపరమైన నిబద్ధతపై తనకు నమ్మకం ఉందన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు. ఈ ప్రతిజ్ఞతో తనకు సంబంధంలేదని ఆ వీడియో వైరల్ అయినప్పుడు స్పష్టం చేసినట్లు తెలిపారు. దీని వల్ల ఎవరి మనోభావాలైన దెబ్బతిని ఉంటే అందుకు తీవ్రంగా చింతిస్తున్నట్లు నిర్వాహకులు వివరణ ఇచ్చినట్లు తెలిపారు.