చిట్టీల రమాదేవిపై ఉప్పల్లో కేసు నమోదు
ABN , First Publish Date - 2021-04-13T12:14:19+05:30 IST
నిబంధనలకు విరుద్ధంగా చిట్టీలు నిర్వహించడమే కాకుండా,
హైదరాబాద్/ఉప్పల్ : నిబంధనలకు విరుద్ధంగా చిట్టీలు నిర్వహించడమే కాకుండా, సభ్యులకు లక్షలాది రూపాయల మేర కుచ్చుటోపీ వేసి పరారైన ఓ మహిళపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీరప్పగడ్డ ప్రశాంత్నగర్లో నివసించే కాదరి రమాదేవి(55) గత కొన్నేళ్లుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తోంది. చిట్టీల మొత్తం కట్టించుకొని తిరిగి చెల్లించకుండా తప్పించుకు తిరుగుతోంది. అధిక వడ్డీ ఆశచూపి రేపు మాపు అంటూ కాలం వెళ్లదీసింది. కూతురి పెళ్లి ఉందంటూ మభ్యపెట్టిన రమాదేవి తన స్వంత ఇంటిని విక్రయించి ఈ నెల 10న బిచాణా ఎత్తేసింది. బాధితులు ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.