గ్రామాల విలీనం కేసు వాయిదా
ABN , First Publish Date - 2021-04-21T05:56:22+05:30 IST
కందుకూరు మున్సిపాలిటీలో గ్రామాలను విలీనం చేసిన వ్యవహారంపై హైకోర్టులో జరుగుతున్న విచారణ జూన్ 3వ వారానికి వాయిదా పడింది.
కందుకూరు, ఏప్రిల్ 20: కందుకూరు మున్సిపాలిటీలో గ్రామాలను విలీనం చేసిన వ్యవహారంపై హైకోర్టులో జరుగుతున్న విచారణ జూన్ 3వ వారానికి వాయిదా పడింది. మున్సిపాలిటీలో దివివారిపాలెం, గనిగుంట, కలవకూరివారిపాలెం, చుట్టుగుంట, ఆనందపురం, గళ్లావారిపాలెం, కండ్రావారిపాలెం, శామీరపాలెం తదితర గ్రామాలను విలీనం చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆర్డినెన్స్ తగదని గ్రామీణ జీవన విధానంలో ఉన్న గ్రామాలను మున్సిపాలిటీ నుండి విడదీసి పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ఏఎంసీ మాజీచైర్మన్ తల్లపనేని వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిలర్ దాసరి మాల్యాద్రి తదితరులు హైకోర్టులో రిట్లు దాఖలు చేశారు. కాగా ఈ పిటీషన్లపై జస్టిస్ అరూప్ గోస్వామి, ప్రవీణ్ కుమార్లతో కూడిన హైకోర్టు బెంచ్ మంగళవారం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని కోర్టుకి నివేదించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కేసు విచారణ ను జూన్ 3వ వారానికి వాయిదా వేశారు.