సినీ నటుడు సిద్ధార్థ్‌పై కేసు

ABN , First Publish Date - 2022-01-13T02:04:00+05:30 IST

హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్‌ పోలీసులు సినీ నటుడు సిద్ధార్థపై కేసు నమోదు చేశారు. ట్విటర్‌లో షట్లర్ సైనా నెహ్వాల్‌‌పై సిద్ధార్థ అసభ్యకర మెసేజ్ చేశారంటూ ఫిర్యాదు చేశారు.

సినీ నటుడు సిద్ధార్థ్‌పై కేసు

హైదరాబాద్: హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్‌ పోలీసులు సినీ నటుడు సిద్ధార్థ్‌పై  కేసు నమోదు చేశారు. ట్విటర్‌లో షట్లర్ సైనా నెహ్వాల్‌‌పై సిద్ధార్థ్ అసభ్యకర మెసేజ్ చేశారంటూ ఫిర్యాదు చేశారు. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై సైబర్ క్రైమ్‌లో కేసు నమోదు చేశారు. సెక్షన్ 67 సైబర్ యాక్ట్, ఐపీసీ 509 సెక్షన్ల కింద సిద్ధార్థపై కేసు నమోదు చేశారు. షట్లర్ సైనా నెహ్వాల్‌ను ఉద్దేశించి సిద్ధార్థ కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యలను పలువురు తప్పుబట్టారు. అయితే విమర్శలు రావడంతో ఎట్టకేలకు సైనా నెహ్వాల్‌కు సిద్ధార్థ్ క్షమాపణలు చెప్పారు.


‘‘కొద్ది రోజుల కిందట మీరు చేసిన ట్వీట్‌కు స్పందనగా నేనో అసభ్యకరమైన జోక్‌ చేశాను. దానికి నేను క్షమాపణలు కోరుతున్నా. మీతో చాలా అంశాల్లో నేను ఏకీభవించలేదు. అసంతృప్తి కూడా వ్యక్తం చేశాను. కానీ, మీ ట్వీట్‌ చూసిన తర్వాత ఆగ్రహంతో నేను స్పందించిన తీరు, వాడిన భాష సరికాదు. నేను జోక్‌ చేశాను తప్ప ఎలాంటి దురుద్దేశంతోనూ ఆ వ్యాఖ్యలు చేయలేదు. నేను మహిళలను గౌరవిస్తాను. నా ట్వీట్‌లో ఎలాంటి లింగ వివక్షా చూపలేదు. మహిళ కాబట్టి మీ మీద దాడి చేయాలన్న ఉద్దేశం ఎంత మాత్రం లేదు. ఇక ఇంతటితో మనం ఈ విషయాన్ని వదిలేద్దాం. మీరు నా లేఖను అంగీకరిస్తారని ఆశిస్తున్నా. మీరెప్పుడూ నా చాంపియనే. నిజాయితీతో మీ సిద్ధార్థ్‌’’ అని ట్వీట్‌ చేశారు.  


Updated Date - 2022-01-13T02:04:00+05:30 IST