చైనా జైళ్లకూ పాకిన కొవిడ్‌-19

ABN , First Publish Date - 2020-02-22T08:26:23+05:30 IST

చైనావ్యాప్తంగా పలు జైళ్లలో 500 మందికిపైగా ఖైదీలకు కొవిడ్‌-19 వైరస్‌ సోకినట్టు అధికారులు గుర్తించారు. చైనా తర్వాత అత్యధిక

చైనా జైళ్లకూ పాకిన కొవిడ్‌-19

  • 500 మందికి పైగా ఖైదీలకు వైరస్‌
  • మా వైపు నుంచి ఆలస్యమేమీ లేదు
  • భారత్‌ విమానానికి అనుమతిపై చైనా 

బీజింగ్‌, న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: చైనావ్యాప్తంగా పలు జైళ్లలో 500 మందికిపైగా ఖైదీలకు కొవిడ్‌-19 వైరస్‌ సోకినట్టు అధికారులు గుర్తించారు.   చైనా తర్వాత అత్యధిక కొవిడ్‌-19 కేసులు జపాన్‌ తీరంలోని నౌకలో నమోదయ్యాయి. కాగా.. చైనాలో కొత్తగా 889 కొవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్‌ కారణంగా ఇప్పటిదాకా 2247 మంది చనిపోయారు. వైరస్‌ బారిన పడినవారి సంఖ్య 76,700కు చేరింది. వూహాన్‌లో కొవిడ్‌-19 పేషంట్లకు చికిత్స చేసేందుకు తన పెళ్లినే వాయిదా వేసుకున్న పెంగ్‌ (29) అనే యువవైద్యుడు చివరకు ఆ వైర్‌సకే బలైపోయాడు. ఇరాన్‌లో కొవిడ్‌-19 కారణంగా ఇద్దరు చనిపోయారు.


దక్షిణ కొరియాలో వైరస్‌ బాధితుల సంఖ్య 204కు చేరింది. ఈ వైరస్‌ సోకిన ఒక వృద్ధురాలు స్థానిక చర్చిలో ప్రార్థనలు చేయడానికి వెళ్లినప్పుడు ఆమె ద్వారా చాలా మంది ఈ వైరస్‌ బారిన పడినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు.. చైనా నుంచి స్వదేశానికి తరలివచ్చిన 45 మంది ఉక్రెయిన్‌ వాసులకు చేదు అనుభవం ఎదురైంది. వారిని దేశంలోకి అడుగుపెట్టనివ్వొద్దంటూ పలువురు ఆందోళనలకు దిగారు. అమెరికాలో కూడా కరోనా పేరుతో ఆసియన్లపై విద్వేష దాడులు జరుగుతున్నాయి.


కాగా.. కొవిడ్‌-19 విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ సూచించారు. ఇక.. చైనాలో మిగిలిపోయిన 80 మంది భారతీయులను తరలించడానికి పంపుతున్న సీ-17 గ్లోబ్‌మాస్టర్‌ విమానానికి అనుమతులు ఇవ్వడంలో తమవైపు నుంచి ఆలస్యమేమీ లేదని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. కొవిడ్‌-19కు వ్యాక్సిన్‌ కనుగొనేందుకు చైనా కుబేరుడు.. అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌మా.. కొలంబియా యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకోసం జాక్‌ మా ఫౌండేషన్‌ నుంచి రూ.15 కోట్లు వెచ్చించనున్నారు.


తగ్గిన నివారణ చాన్స్‌ : డబ్ల్యూహెచ్‌వో

జనీవా, ఫిబ్రవరి 21: కరోనా వైరస్‌ నివారణకు గల అవకాశాలు రోజురోజుకీ తగ్గిపోతున్నాయని, అంతర్జాతీయ సమాజం ఇప్పటికైనా కలిసి రాకుంటే పరిణామాలు ఊహాతీతంగా ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అధ్యక్షుడు టెడ్రస్‌ అఽధనోం గేబ్రియేసస్‌.. జెనీవాలో జరిగిన ఓ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-02-22T08:26:23+05:30 IST