ఓటీఎస్ పేరుతో ధనదోపిడీ: అబ్దుల్ అజీజ్
ABN , First Publish Date - 2021-12-09T04:26:36+05:30 IST
ఒక రూపాయికే పేదలకు ఇళ్లు అందిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ ఓటీఎస్ పేరుతో ధనదోపిడీకి సిద్ధమయ్యారని టీడీపీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ విమర్శించారు.
ఆర్టికల్ 21 కలెక్టర్లు ఉల్లంఘన
టీడీపీ నేత అబ్దుల్ అజీజ్
నెల్లూరు, (వ్యవసాయం), డిసెంబరు 8 : ఒక రూపాయికే పేదలకు ఇళ్లు అందిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ ఓటీఎస్ పేరుతో ధనదోపిడీకి సిద్ధమయ్యారని టీడీపీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ విమర్శించారు. నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ. 10వేల కోట్లు దోచేయాలనే దురుద్దేశంతో జగన్రెడ్డి కొత్త పథకాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. కలెక్టర్లు ఆర్టికల్ 21 ఉల్లంఘటనకు పాల్పడుతున్నారన్నారు. అంతేగాక అన్ని శాఖల అధికారులకు టార్గెట్లు పెట్టి ప్రజలను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రూ. 5వేల జీతమిచ్చి వలంటీర్ల చేత చేయరాని పాపాలు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటీఎస్ పథకం కింద డబ్బులు కట్టకపోతే ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాలను రద్దు చేస్తామని అధికారులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిపై వ్యక్తిగత కేసులు పెడతామని హెచ్చరించారు. టీడీపీ అధికారంలోకి రాగానే తొలి సంతకం గృహాలపై పెట్టి ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయిస్తామన్నారు. సమావేశంలో నాయకులు ఖాజావలి, సంపత్యాదవ్, భూలక్ష్మి, సురేంద్రబాబు, పెంచల నాయుడు, సాబీర్ఖాన్, నన్నేసాహెబ్, ఈదర శ్రీనివాసులు, సయ్యద్ సాజీద్బాషా, రసూల్, బాబు, అస్లాం పాల్గొన్నారు.