Hyderabad లోని ఈ ప్రాంతంలో వరుసగా పిల్లులు ఎందుకు చనిపోతున్నాయ్..!?
ABN , First Publish Date - 2021-07-22T18:22:14+05:30 IST
ఎవరు, ఎందుకు చంపుతున్నారనే అంశాలపై....
- పోలీస్స్టేషన్లో మహిళల ఫిర్యాదు
హైదరాబాద్ సిటీ/పేట్బషీరాబాద్ : అనుమానాస్పద స్థితిలో మూగ జీవాలు మృతి చెందుతున్నాయి. వీటిపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ ఇద్దరు మహిళలు పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుండ్లపోచంపల్లి స్ల్పెండిడ్ అపర్ణ ఫామ్ డోస్ గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటున్న అనిత పీటర్స్, అనిషా చౌదరీ విల్లా నంబర్ 132 సమీపంలో మూగజీవాలు (పిల్లులు) చనిపోయి ఉండడాన్ని పలుమార్లు చూశారు. వాటిని తీవ్రంగా గాయపరిచి రెండు కాళ్లు తాళ్లతో కట్టి హింసాత్మకంగా చంపుతున్నట్లు గుర్తించారు. దీంతో వారు మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పుండూరుకు చెందిన ప్రభుత్వ వెటర్నరీ వైద్యులు పిల్లికి పోస్టుమార్టం చేపట్టి పంచనామా చేశారు. వరుసగా మూగజీవాలు మృత్యువాత పడడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరు, ఎందుకు చంపుతున్నారనే అంశాలపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.