వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ అరెస్టు

ABN , First Publish Date - 2021-08-03T18:57:08+05:30 IST

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ అరెస్టు

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు, పులివెందులకు చెందిన సునీల్ యాదవ్‌ను సీబీఐ అధికారులు గోవాలో అరెస్టు చేశారు. ఈ విషయాన్ని సీబీఐ అధికారికంగా ధృవీకరించింది. నిన్న సాయంత్రం గోవాలో అరెస్టు చేసిన అధికారులు ఇవాళ గోవా స్థానిక కోర్టులో హాజరుపర్చి ట్రాన్సిట్‌ రిమాండ్‌లోకి తీసుకున్నారు. గోవా నుంచి కడపకు తీసుకువచ్చి బుధవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. 


వివేకా హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న సునీల్‌‌ను ఇప్పటికే పలుమార్లు సీబీఐ అధికారులు విచారించారు. తనను సీబీఐ వేధిస్తోందని, థర్డ్ డిగ్రీతో  టార్చర్ పెడుతోందంటూ సునీల్ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశాడు. అనంతరం ఆయన పులివెందులలోని తన ఇంటికి తాళాలు వేసి పరారయ్యాడు. ఈ నేపథ్యంలో సునీల్ గోవాలో తలదాచుకున్నట్లు తెలుసుకున్న సీబీఐ అధికారులు గోవాకు వెళ్లి అరెస్టు చేశారు. గోవా స్థానిక కోర్టులో హాజరు పర్చిన అధికారులు ట్రాన్సిట్‌ రిమాండ్‌లోకి తీసుకున్నారు.

Updated Date - 2021-08-03T18:57:08+05:30 IST