కేజీహెచ్లో సీబీఐ
ABN , First Publish Date - 2020-06-01T08:33:49+05:30 IST
నర్సీపట్నం ఆస్పత్రి మత్తు వైద్యుడు డాక్టర్ సుధాకర్ను సస్పెండ్, అరెస్టు చేసిన కేసుపై సీబీఐ అధికారులు కేజీహెచ్లో విచారణ ప్రారంభించారు.
డాక్టర్ సుధాకర్ కేసు విచారణ.. ఎంఎల్సీ రికార్డు సీజ్
విశాఖపట్నం/మహారాణిపేట, మే 31(ఆంధ్రజ్యోతి): నర్సీపట్నం ఆస్పత్రి మత్తు వైద్యుడు డాక్టర్ సుధాకర్ను సస్పెండ్, అరెస్టు చేసిన కేసుపై సీబీఐ అధికారులు కేజీహెచ్లో విచారణ ప్రారంభించారు. సుధాకర్ను ఇటీవల విశాఖలోని అక్కయ్యపాలెం సమీపంలో జాతీయ రహదారిపై పోలీసులు అదుపులోకి తీసుకోవడం, తొలుత కేజీహెచ్కు, అనంతరం మానసిక వైద్యశాలకు తరలించడం వివాదాస్పదమైంది. దీనిపై హైకోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. శనివారం రాత్రి కేజీహెచ్కు వెళ్లి సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్ను వారు కలిశారు. సుధాకర్కు చికిత్స చేసిన రోజుకు సంబంఽధించిన మెడికో లీగల్ కేసు(ఎంఎల్సీ) రికార్డును సీజ్ చేసి తీసుకెళ్లారు.
ఆదివారం ఉదయం మరోసారి ఆస్పత్రికి వచ్చిన అధికారులు.. సుధాకర్ను ఆస్పత్రికి తీసుకొచ్చినప్పటి నుంచి తిరిగి మానసిక వైద్యశాలకు పంపించే వరకు అందించిన చికిత్సకు సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఫుటేజీల్లో ఇద్దరు పీజీలు ప్రధానంగా కనిపించడంతో సోమవారం వారిని విచారించేందుకు అందుబాటులో ఉంచాలని ఆస్పత్రి వైద్యాధికారులను కోరారు. సీసీ కెమెరాల హార్డ్డి్స్కను సోమవారం తమకు అందజేయాలని కోరుతూ ఒక రిక్విజేషన్ను అందజేశారు. అలాగే సుధాకర్ను ఆస్పత్రికి తీసుకొచ్చినప్పుడు విధుల్లో ఉన్న క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వంశీకృష్ణతోపాటు, ఫిజీషియన్ డాక్టర్ కనకమహాలక్మిని కూడా విచారించారు.