బలవంతపు వసూళ్ల కేసు: దేశ్‌ముఖ్ పీఏలను ప్రశ్నించనున్న సీబీఐ

ABN , First Publish Date - 2021-04-11T22:07:30+05:30 IST

బలవంతపు వసూళ్ల కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వ్యక్తిగత సహాయకులను..

బలవంతపు వసూళ్ల కేసు: దేశ్‌ముఖ్ పీఏలను ప్రశ్నించనున్న సీబీఐ

ముంబై: బలవంతపు వసూళ్ల కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వ్యక్తిగత సహాయకులను (పీఏలు) సీబీఐ ప్రశ్నించనుంది. ఈ కేసులో అవినీతి ఆరోపణలపై విచారణకు తమ ముందు హాజరుకావాల్సిందిగా దేశ్‌ముఖ పీఏలు ఇద్దరికి సీబీఐ సమాచారం పంపింది. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరం బీర్ సింగ్ చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగా దేశ్‌ముఖ్ పీఏలైన సంజీవ్ పలాండే, కుందన్‌లను సీబీఐ విచారించనుంది. ముంబై హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తు జరుపుతోంది. ఈ విచారణ సమయంలోనే పలాండే, కుందన్ పేర్లు తెరపైకి వచ్చాయి.


బలవంతపు వసూళ్లకు వాజేను దేశ్‌ముఖ్ ఆదేశించినప్పుడు పలాడ్ అక్కడే ఉన్నాడని, ఇలాంటి ఒక సందర్భంలో కుందన్ కూడా అక్కడే ఉన్నాడని పరం బీర్ సింగ్ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. బార్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థల నుంచి ప్రతినెలా రూ.100 కోట్లు వసూలు చేయాలని ఇటీవల సస్పెండైన ఏపీఐ సచిన్ వాజేకు దేశ్‌ముఖ్ ఆదేశాలిచ్చినట్టు సీఎంకు రాసిన లేఖలో సింగ్ ఆరోపించడం సంచలనమైంది. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను దేశ్‌ముఖ తోసిపుచ్చారు. కాగా, ఈ కేసులో సీబీఐ బృదం ఇంతవరకూ, సచిన్ వాజే, డీసీపీ రాజు భుజ్‌బల్, ఏసీపీ సంజయ్ పాటిల్, అడ్వకేట్ జయశ్రీ పాటిల్, హోటల్ యజమాని మహేష్ షెట్టిల వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. సచిన్ వాజే అసోసియేట్ అయిన ఏపీఐ రియాజ్ ఖాజిని ఎన్ఐఏ అరెస్టు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్న సచిన్ వాజే.. మన్‌సుఖ్ హీరెన్ మృతి కేసు, యాంటిలియా బాంబ్ స్కేర్ కేసులో నిందితుడుగా ఉన్నారు.

Updated Date - 2021-04-11T22:07:30+05:30 IST