జడ్జీలపై అనుచిత వ్యాఖ్యల కేసు... సీల్డ్కవర్లో సీబీఐ నివేదిక
ABN , First Publish Date - 2021-11-23T09:42:53+05:30 IST
న్యాయవ్యవస్థ, హైకోర్టు న్యాయమూర్తుల ప్రతిష్ఠను దిగజార్చుతూ అనుచిత పోస్టులు పెట్టిన కేసులో దర్యాప్తు పురోగతి పై వివరాలను సీబీఐ డైరెక్టర్...
- రిజిస్ట్రార్ జనరల్కు ఇవ్వాలన్న హైకోర్టు
- విచారణ డిసెంబరు 13కి వాయిదా
అమరావతి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): న్యాయవ్యవస్థ, హైకోర్టు న్యాయమూర్తుల ప్రతిష్ఠను దిగజార్చుతూ అనుచిత పోస్టులు పెట్టిన కేసులో దర్యాప్తు పురోగతి పై వివరాలను సీబీఐ డైరెక్టర్...హైకోర్టు ముందు ఉంచారు. సీల్డ్ కవర్లో నివేదికను ఉంచి సమర్పించారు. ఆ నివేదికను పిటిషనర్కు (రిజిస్ట్రార్ జనరల్) అందజేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. విచారణను డిసెంబరు 13వ తేదీకి వాయిదావేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలిచ్చింది. వివిధ అంశాలకు సంబంధించి తీర్పుల వెల్లడి అనంతరం న్యాయవ్యవస్థ పట్ల, హైకోర్టు న్యాయమూర్తుల పట్ల సామాజిక మాధ్యమాల్లో కొంతమంది చేసిన అనుచిత వ్యాఖ్యలపై సీఐడీ సైబర్ క్రైమ్కు రెండుసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని...దర్యాప్తులో పురోగతి లేనందున, కేసును స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థిస్తూ ఇన్చార్జ్ రిజిస్ట్రార్ జనరల్ గత ఏడాది మే 26వ తేదీన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ను విచారించిన ధర్మాసనం 2020 అక్టోబర్ 12న ఈ వ్యాఖ్యల వ్యవహారంలో ఏదైనా కుట్ర ఉందేమో తేల్చాలని సీబీఐని ఆదేశించింది. ఈ వ్యాజ్యాలు ఇటీవల విచారణకు రాగా ఈ కేసు విచారణ ప్రారంభమైన దగ్గర నుంచి ఏమిచేశారో తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐ డైరెక్టర్ను ఆదేశించిన విషయం తెలిసిందే. సోమవారం ఈ వ్యాజ్యాలు మరోసారి విచారణకు రాగా.. ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ తరఫున న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ... ‘‘న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులకు సంబంధించిన వీడియోల యూఆర్ఎల్ వివరాలను సామాజిక మాధ్యమాల గ్రీవెన్స్ అధికారులకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ అందజేస్తున్నారు. రిజిస్ట్రార్ జనరల్ ఇచ్చిన యూఆర్ఎల్ వివరాల ఆధారంగా సామాజిక మాధ్యమాలు ఎప్పటికప్పుడు వీడియోలను తొలగిస్తున్నాయి. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేసు దర్యాప్తు పురోగతిపై సీబీఐ డైరెక్టర్ అఫిడవిట్ దాఖలు చేశారు. సీల్డ్ కవర్లో ఉన్న ఆ రిపోర్టును పరిశీలించకుండా వాదనలు కొనసాగించడం సాధ్యం కాదు.’ అని పేర్కొన్నారు.
సీబీఐ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు స్పందిస్తూ.. కేసుపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఈ దశలో వివరాలను నిందితులకు అందజేస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని, కోర్టు ఆదేశిస్తే వివరాలను పిటిషనర్కు అందజేస్తామన్నారు. సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, వాట్సప్ తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ....వీడియోలను తొలగించాలని సీబీఐ నేరుగా సామాజిక మాధ్యమాలను కోరలేదన్నారు. రిజిస్ట్రార్ జనరల్ ద్వారా వివరాలు అందజేస్తే వీడియోలు తొలగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. న్యాయవ్యవస్థను దూషిస్తూ పెట్టిన పోస్టులకు సంబంధించిన యూఆర్ఎల్ను అందజేస్తే సంబంధిత వీడియోను తొలగిస్తామని చెప్పారు. అయితే, సంబంధిత వ్యక్తి ప్రొఫైల్ను పూర్తిగా రద్దు చేయడం సాధ్యం కాదన్నారు. యూట్యూబ్, గూగుల్ తరఫున సీనియర్ న్యాయవాది సంజయ్ పూవయ్య, ట్విట్టర్ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.... సీబీఐ డైరెక్టర్ దాఖలు చేసిన అఫిడవిట్ను రిజిస్ట్రార్ జనరల్కు అందజేయాలని ఆదేశిస్తూ విచారణను వాయి దా వేసింది. మరోవైపు సామాజిక మాధ్యమాలలో పోస్టింగ్లు పెట్టినవారిపై సుమోటోగా నమోదు చేసిన కేసును వచ్చేనెల 13కి వాయిదా వేసింది.