సీసీరోడ్డుకు అడ్డంగా ముళ్ల కంప
ABN , First Publish Date - 2020-12-03T03:46:40+05:30 IST
మండలంలోని మల్లాపాలెం గ్రామంలో అధికార పార్టీకి చెందిన వ్యక్తులు సీసీరోడ్డుకు అడ్డంగా ముళ్ల కంప వేసి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు.
వైసీపీ నేతల నిర్వాకం
తొలగించేందుకు జంకుతున్న అధికారులు
పుల్లలచెరువు, డిసెంబరు 2: మండలంలోని మల్లాపాలెం గ్రామంలో అధికార పార్టీకి చెందిన వ్యక్తులు సీసీరోడ్డుకు అడ్డంగా ముళ్ల కంప వేసి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. దీంతో ఆ వీఽధిలోని పేదలు నడవటానికి నానా పాట్లు పడుతున్నారు. మల్లాపాలెం గ్రామంలోని బీసీ, ఎస్సీలు 40 కుటుంబాల వారు టీడీపీకి మద్దతు దారులుగా ఉన్నారు. దీంతో రహదారికి కంపను అడ్డంగా వేసి నడవటానికి లేకుండా చేశారు. దీంతో తాము బజారుకు రావాలంటే చుట్టూ తిరిగి రావాల్సి వస్తోందని అక్కడి వారు వాపోతున్నారు. ప్రభుత్వ రహదారిపై అడ్డంగా కంప వేసి ఆరు నెలలు గడుస్తున్నా రాజకీయ ఒత్తిళ్లతో నేటీకీ తీసేందుకు జంకుతున్నారు. సీసీరోడ్డుపై రాజకీయం చేసి కంప వేయడంపై చూసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు. మల్లాపాలెం గ్రామానికి చెందిన టీడీపీ మాజీ మండలాధ్యక్షుడు బుధవారం ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ రాజకీయ ఒత్తిళ్లతోనే సీసీ రోడ్డుపై వేసిన కంపను తొలగించలేదని , అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు. అధికార పార్టీ నాయకులు తమ గ్రామంలో దౌర్జన్యం చేస్తూ బీసీ, ఎస్సీలను ఇబ్బంది పెడుతున్నారని ఆయన తెలిపారు. రోడ్డుపై కంప తొలగించే వరకూ టీడీపీ పోరాటం చేస్తుందని తెలిపారు.
చర్యలు తీసుకుంటాం
ఇప్పటికే కంప వేసిన వారికి తొలగించమని పలుమార్లు చెప్పాం. రెండు రోజుల్లో సీసీ రోడ్డుపై కంపను తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం.
- పంచాయతీ కార్యదర్శి పూర్ణచంద్